ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు ప్రత్యక్ష వారధి వారే. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం, అర్హులైన వారికి పథకాలు అందేలా చూడటం వీరి ముఖ్య విధి. పైగా పిఛన్లు వంటి వాటిని ఇంటికే తీసుకెళ్లి లబ్ధిదారులకు అందజేస్తూ ఉంటారు. వీరికి గౌరవ వేతనం ఇస్తున్న విషయం తెలిసిందే. వీరి జీతాల పెంపు విషయంలో మంత్రి కీలక ప్రకటన చేశారు.
ఏపీలో ఉన్న వాలంటీర్లకు మంత్రి పినిపే విశ్వరూప్ శుభవార్త చెప్పారు. వారి జీతాల పెంపు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల జీతం రూ.15 వేల వరకు పెంచే యోచనలో ఉన్నారని.. సీఎం జగన్ కూడా అందుకు సుముఖంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం గ్రామంలో పినిపే విశ్వరూప్ వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“వైసీపీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతాన్ని రూ.15 వేలకు పెంచుతారు. ఈ విషయంపై సీఎం జగన్ కూడా సముఖుతతోనే ఉన్నారు. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా వాలంటీర్లు కృష్టి చేయాలి. అన్ని పథకాలకు సంబంధించి 6 నెలలకొకసారి క్రాస్ వెరిఫై చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి. వచ్చే ఎన్నికల్లో వేరే ప్రభుత్వ అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు పోతాయి.
పేదరికమే కొలమానంగా అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నాం. పెరిగిన పింఛను మొత్తాన్ని జనవరి నుంచే అందజేస్తున్నాం. పింఛన్లు తీసేస్తున్నాం అనేది అవాస్తవం. 2019లో 39 లక్షలు ఉన్న పింఛన్లను ఇప్పుడు 69 లక్షలుగా ఉన్నాయి. నా నియోజకవర్గంలో కొత్తగా 1200 మందికి పింఛన్లు మంజూరు చేశాం” అంటూ మంత్రి పినిపే విశ్వరూప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. వాలంటీర్ల జీతం రూ.15 వేలకు పెంచే అవకాశం ఉందనే వార్త తెలియడంతో వాలంటీర్లు సంబరాలు చేసుకుంటున్నారు.