ప్రస్తుతం దేశంలో ఉన్న ధరలు చూస్తే సామాన్యులకు మింగుడుపడని పరిస్థితి. మద్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే.. సంపాదన కొంత అయితే.. ఖర్చులు కొండంత అన్నట్టుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ క్రమంలో పేద ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. తెల్ల రేషన్ ఉన్నవారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు.
2020 కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.. దాంతో కోట్ల మంది ఉపాధి కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. వారికి అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ని ఆవిష్కరించారు. ఇటీవల దీని గడువు ముగిసినప్పటికీ మరికొన్ని నెలలు పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం పేద ప్రజలకు ఓ గుడ్ న్యూస్ తెలిపింది.. రేషన్ కార్డు వినియోగదారులకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై )కింద 3 నెలల పాటు ఉచిత బియ్యం పంపిణీ చేయబోతున్నట్లు తెలిపింది.
ఏపిలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతినెల 19 నుంచి 28 లోగా బియ్యాన్ని రేషన్ దుకాణాల వద్దకు వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించింది. అయితే రేషన్ బియ్యం పంపిణీలో నాన్ సార్టెక్స్, కొంత నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ ఉన్నాయి. ఏపీలో ఉన్న 26 జిల్లాలలకు గాను పది జిల్లాలకు నాన్ సార్టెక్స్ బియ్యం పంపిణీ చేయబోతున్నట్లుగా.. మిగిలిన పదహారు జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టిఫైడ్ రైస్ ని సరఫరా చేయనున్నట్లు తెలిపింది. కుటుంబలో ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో విటమిన్ బి, ఐరన్ సమృద్దిగా ఉంటుంది. ఏప్రీల్ నాటికి అన్ని జిల్లాలకు ఈ బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.