ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. పెండింగ్ బిల్లులన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించినట్లు ఉప సంఘం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ తమది ప్రజా ప్రభుత్వం అనిపించుకునేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. నవరత్నాల పేరిట తీసుకు వచ్చిన పథకాలు ఇంటింటికీ అందిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఎప్పటి నుండో ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు సమయాత్తమైంది. సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం, సిఎస్, ఆర్థికశాఖ అధికారులు, ఉద్యోగ సంఘాలతో పలు సమస్యలపై చర్చించారు. బకాయిలపై మంత్రి వర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని జగన్ సర్కార్ హమీనిచ్చింది.
ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ కెఎస్ జవహర్రెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. చర్చల అనంతరం మార్చి 31 లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని.. మంత్రివర్గ ఉపసంఘం ప్రకటించింది. పిఆర్సి బకాయిలపై ప్రభుత్వం ఈ నెల 16న సిఎస్ అధ్యక్షతన ఆర్థికశాఖ అధికారులతో చర్చించి స్పష్టత ఇస్తామని మంత్రివర్గ ఉప సంఘం ఉద్యోగ సంఘాలకు హామీనిచ్చింది. సమావేశానంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.
‘ఉద్యోగ సంఘాలతో పెండింగ్ సమస్యలపై చర్చించాం. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే.. అందరూ కలిసికట్టుగా చేయాలి. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. సుమారు రూ.3 వేల కోట్ల మేర చెల్లింపులు ఈ నెలాఖరులోగా చెల్లిస్తాం. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని నిర్ణయించాం’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆది మూలపు సురేష్ మాట్లాడుతూ..పెండింగ్ క్లెయిమ్స్ మార్చి 31 నాటికి క్లియర్ చేస్తామన్నారు. ఉద్యోగులకు జీపీఎఫ్ బకాయిలు మార్చి 31 లోపల చెల్లిస్తామన్నారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ.. మెడికల్ ఎరియర్స్ అన్నీ ఈ నెల చివరి నాటికి క్లియర్ చేస్తామని తెలిపారు. ఈసారి కూడా కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని.. ప్రభుత్వం చర్చలకు అహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది.