నెల్లూరు వాసుల చిరకాల స్వప్నం.. నేడు సాకారం అయ్యింది. జిల్లా వాసుల దశాబ్దాల కోరిక అయిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ఈ గొప్ప కార్యాన్ని ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. మంగళవారం ప్రాజెక్ట్లను ప్రారంభించి.. జాతికి అంకితం చేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం జగన్. సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం వల్ల సోమశిల ప్రాజెక్టు వరద ప్రవాహాన్ని ఎక్కడికక్కడ నియంత్రించడానికి అవకాశం లభించింది అంటున్నారు నీటిపారుదల శాఖ నిపుణులు.
ఈ ప్రాజెక్ట్ల నిర్మాణంతో పెన్నానది లోతట్టు ప్రాంతాల ముప్పునకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయ్యింది అన్నారు. పెన్నానదికి వరదలు వస్తే వణికిపోయే నెల్లూరు నగర లోతట్టు ప్రాంతాలు.. ఇప్పుడు ఈ రెండు బ్యారేజీల నిర్మాణం పూర్తితో ఇక నిశ్చింతగా ఉండనున్నారు. 10.95 లక్షల క్యూసెక్కుల నీటిని ఏక కాలంలో డిశ్చార్జి చేసేలా బ్యారేజీ రూపకల్పన చేయడం, 3 కి.మీ. కరకట్టలు నిర్మించడంతో వరదలకు ఎండ్కార్డ్ పడినట్లు నిపుణులు వివరిస్తున్నారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2006 మే 28న ఈ ప్రాజెక్ట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2008లో పనులు ప్రారంభించారు. శరవేగంగా కొనసాగిన ఆ పనులు వైఎస్సార్ మృతితో నిలిచిపోయాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టలేదు. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ ప్రాజెక్ట్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అప్పటి వైసీపీ మంత్రి అయిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ ఆవశ్యకతను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారు.
ఈ క్రమంలో అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ అనిల్కుమార్యాదవ్ కొనసాగుతుండడంతో అటు సంగం, ఇటు నెల్లూరు బ్యారేజీ పనులకు అత్యంత ప్రాధాన్యత లభించింది. ఈలోపు మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం చెందడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్రెడ్డి పేరును పెట్టి.. ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేశారు. ఇక సీఎం జగన్ మంగళవారం మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ను ప్రారంభించారు. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టి బ్యారేజ్ను ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు. అనంతరం పెన్నా నదికి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకపాటి కుటుంబ సభ్యులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. దశాబ్దాల స్వప్నం సాకారం కావడంతో సింహపూరి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.