జగన్ మోహన్ రెడ్డి.. ఒక రాజకీయ నేతగా, ముఖ్యమంత్రిగా ఆయనపై ప్రత్యర్థులు విమర్శలు చేయడం, వాటిపై తనదైనశైలిలో ఛలోక్తులు విసరడం సర్వసాధారణం. ఏ రాజకీయ నాయకుడికి సాధ్యం కాని విధంగా.. సీఎం జగన్ చాలా చిన్న వయసులోనే మంచి మాస్ ఫాలోయింగ్ను సొంతం చేసుకున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే సీఎం జగన్ కూడా ప్రజలకు ఎంతో చేరువగా ఉంటూ ఉంటారు. ఎక్కువగా వారితో నేరుగా మాట్లాడేందుకు, వారి కష్టాలను స్వయంగా వినేందుకు ప్రయత్నిస్తుంటారు. నిజానికి అవి చాలా చిన్న విషయాలే అయినా కూడా.. ప్రజల్లో మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి.
అలాంటి ఒక ఆసక్తికర ఘటనే గురువారం కృష్ణా జిల్లా పెడనలో సంభవించింది. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సభకు కొందరు బాధితులు అర్జీలు ఇచ్చేందుకు వచ్చి ఎదురు చూస్తున్నారు. చేతిలో పేపర్లు పట్టుకుని బేలగా చూస్తున్న వాళ్లను పోడియం మీదనుంచి సీఎం జగన్ గమనించారు. వెంటనే వారిని తన వద్దకు తీసుకురావాలని కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ మహేశ్ కుమార్లకు సూచించారు.
వారు వెంటనే అనారోగ్య బాధిత బాలుడి తల్లిదండ్రులు, వృద్ధురాలు, మరో ముగ్గురు మహిళలను బారికేడ్లు దాటించి స్టేజ్ వద్దకు తీసుకొచ్చారు. సీఎంవో కార్యదర్శి ముత్యాలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి సీఎం జగన్కు అందజేశారు. వాటిని పరిశీలించి.. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు.
ఆ తర్వాత తిరిగి నేతన్న నేస్తం కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. అయితే వారి గురించి అక్కడితో వదిలేయలేదు. మళ్లీ సభ ముగిసిన తర్వాత సీఎం జగన్ గుర్తు పెట్టుకుని అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన బాధితులను స్వయంగా కలిశారు. వారిని తన వద్దకు పిలిపించుకుని వారితో ముచ్చటించారు. మరోసారి వారి కష్టాలను స్వయంగా విని.. వాటిని వెంటనే పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఆ వృద్ధురాలు, మహిళల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.