సమాజంలో పని చేసుకోవడానికి ఎన్ని వృత్తులున్నా వాటిల్లో వైద్యవృత్తి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. చావుబతుకుల్లో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడాలంటే అది కేవలం డాక్టర్లే చేయగలరు. ఒకరికి ప్రాణం పోయగలరు కాబట్టే వారిని రోగులు దేవుళ్లుగా చూస్తారు. అలాంటి డాక్టర్లు చికిత్స చేయడం ప్రారంభించి మధ్యలోనే చేతులెత్తేస్తే రోగుల పరిస్థితేంటి? చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ఓ పేషెంట్కు ట్రీట్మెంట్ చేస్తూ మధ్యలోనే చికిత్సను ఆపేయడం చర్చనీయాంశంగా మారింది.
యాదమరి మండలం దవళాయిపల్లికి చెందిన పుష్పప్ప (62) గతేడాది డిసెంబర్ 31వ తేదీన ప్రమాదవశాత్తూ జారిపడింది. ఈ ఘటనలో ఆమె కాలి తొడ ఎముక వద్ద గట్టిగా దెబ్బతగిలింది. దీంతో పుష్పమ్మను ఆమె కుటుంబసభ్యులు ఈ నెల నాలుగో తేదీన చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పుష్పమ్మను పరిశీలించిన వైద్యులు.. విరిగిన ఎముక ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎక్స్ రే తీయాలని చెప్పి, ప్రైవేటు ఎక్స్ రే ప్లాంటుకు రాశారు. ఎక్స్ రే తీసుకురాగా దానిని పరిశీలించి ఆపరేషన్ చేయాలని చెప్పి తేదీ కూడా చెప్పారు డాక్టర్లు. తుదిగా శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ గదికి తీసుకెళ్లాక.. పలు కారణాలు చెప్పి ఆపరేషన్ను ప్రారంభించి మధ్యలోనే ఆపేశారు.
ఆపరేషన్ సమయంలో తొడ భాగాన్ని కోసిన డాక్టర్లు మధ్యలోనే కుట్టువేసి.. స్థానికంగా ట్రీట్మెంట్ చేయలేమని, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు ప్రశ్నించగా.. ఎముకలు గట్టిగా లేవంటూ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బాధితులు ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ కంప్లయింట్ చేశారు. తాను సంబంధింత డాక్టర్లతో మాట్లాడతానని, న్యాయం చేస్తానని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాధితురాలిని ఆస్పత్రిలోని ఓ వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు.