ఆంధ్రాలో ఆయా జిల్లాకు చెందిన చాలా మంది ఇతర జిల్లాల్లో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. సంక్రాతి, దసరా లాంటి పండుగలు వచ్చాయంటే చాలు.. చాలా మంది సొంతూళ్లకు బయలుదేరతారు. ఎప్పుడు లేని విధంగా అంత మంది ఒకేసారి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకి రావడం వల్ల పండుగ సీజన్ లో రైళ్లు, బస్సులు ఫుల్ రద్దీగా ఉంటాయి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించుకుంది ఏపీఎస్ ఆర్టీసీ. ఈ దసరా పండక్కి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ.. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులు నడపనుంది.
విజయవాడ నుంచి విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, రాయలసీమ జిల్లాలకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ దసరా పండగ సీజన్ లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం మొత్తం 1081 బస్సులు నడపనుంది ఏపీఎస్ ఆర్టీసీ. దీంతో ప్రయాణికులకు కాస్త రిలీఫ్ ఉంటుందని భావిస్తున్నారు. కాగా ఏపీలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకూ సెలవులు ప్రకటించగా.. తెలంగాణాలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకూ ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. మరి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.