దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. గతంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జరిగిన సందర్భంలో విపక్షాలు ఎంతలా గగ్గోలు పెట్టాయో అందరికి తెలుసు. కేవలం జగన్ ప్రభుత్వం అసమర్థత వల్లే.. డయాఫ్రమ్ వాల్ విధ్వంసం అయ్యిందని.. దానివల్ల ప్రాజెక్ట్ ఖర్చు భారీగా పెరగడమే కాక.. పోలవరం నిర్మాణం ఆలస్యమవుతుందని ఆరోపించాయి. ఈ క్రమంలో పోలవరంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన తప్పులు.. వాటి ఫలితాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ తప్పులను సరిదిద్దడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ఆ వివరాలు..
సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్టు ప్రణాళికలో భాగంగా… తొలుత గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేయాలి. స్పిల్ వే పూర్తి చేసి.. దాని గుండా నీళ్లను అటు డైవర్ట్ చేసి.. కాపర్ డ్యాం కట్టాలి. కాపర్ డ్యాం అంటే మెయిన్ డ్యాం కట్టడానికి నిర్మించే తాత్కలిక నిర్మాణం. కాపర్ డ్యాం 1, కాపర్ డ్యాం 2, తర్వాత మెయిన్ డ్యాం కట్టాలి. వీటి జోలికి పోకముందే స్పిల్ వే, అప్రోచ్ చానెల్ పనులు పూర్తి చేయాలి. అది పూర్తయ్యాకే కాపర్ డ్యాం కట్టాలి’’ అని తెలిపారు.
‘‘కానీ చంద్రబాబు నాయుడు స్పిల్ వే, అప్రోచ్ చానెల్ పూర్తి చేయకుండా.. 2.1 కిలోమీటర్ల గోదావరి విస్తీర్ణంలో అప్పర్ కాపర్ డ్యాం కట్టారు.. 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది.. అప్పర్ కాపర్ డ్యాం వద్ద వదిలిన 380 మీటర్ల గ్యాప్, మరోచోట 300 మీటర్ల గ్యాప్ ద్వారా.. అలానే దిగువ కాపర్ డ్యాం నిర్మాణంలో ఒక చోట వదిలిన 680 మీటర్లు గ్యాప్.. మరోచోట వదిలిన 120 మీటర్ల గ్యాప్ ద్వారా ప్రవహించాల్సి వచ్చింది. 2.1 కిలోమీటర్ల విస్తీర్ణంలో పోవాల్సిన గోదావరి నది ఇంత తక్కువ గ్యాప్లో పోవాల్సి రావడం వల్ల స్కౌరింగ్ జరిగింది. ఫలితంగా డయాఫ్రం వాల్ కింద నుంచి పూర్తిగా ఎత్తేసింది. కింద భాగంలో గుంతలు పడ్డాయి. ఇప్పుడు మేం మళ్లీ పూర్తిగా కింద నుంచి కట్టుకుంటూ వస్తున్నాం. అందుకే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వెనకబడుతూ వస్తోంది. దీనికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదే. డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతిన్నది అనే దాని గురించి ఏ న్యూట్రల్ వ్యక్తిని అడిగిన ఇదే సమాధానం చెబుతారు’’ అన్నారు సీఎం జగన్.
‘‘ఇక తమ ప్రభుత్వం చంద్రబాబు చేసిన తప్పులను మా ప్రభుత్వం సరిదిద్దుతుంది. ప్రస్తుతం నీటిని అప్రోచ్ చానెల్ నుంచి డైవర్ట్ చేసి.. స్పిల్ వే గుండా పోయే ఏర్పాట్లు చేశాం. మా ప్రభత్వం హయాంలో అప్పర్ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యింది. దురదృష్టవశాత్తు.. లోయర్ కాపర్ డ్యాంలో కోతకు గురైన ప్రదేశంలో 30.5 మీటర్ల ఎత్తును పెంచాల్సి వచ్చింది. ఈలోపు వర్షాలు రావడంతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. వర్షాల కారణంగా ప్రస్తుతం పనులు జరగడం లేదు. వర్షాకాలం ముగిసిన తర్వాత పనులు వేగవంతం అవుతాయి’’ అని సీఎం జగన్ స్పష్టంగా వివరించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.