ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. సోమవారం సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పోలవరం ప్రాజెక్ట్పై మాట్లాడారు. టీడీపీ చేస్తోన్న అసత్య ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించింది.. దాన్ని ఎలా నాశనం చేసింది క్లియర్గా వివరించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మొదట స్పిల్వే, అప్రోచ్ పనులు పూర్తి చేయాలి.. ఆ తర్వాత కాపర్ డ్యాం కట్టాల్సి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. పద్నాలుగేళ్లు.. సీఎంగా చేశాను.. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నాను అంటాడు. అలాంటి వ్యక్తి పోలవరం విషయంలో వ్యవహరించి తీరు చూస్తే.. ఈయన సీఎం కాదు కదా.. కనీసం ఎమ్మెల్యే కావడానికి కూడా అర్హుడు కాదనిపిస్తోంది. పోలవరం విషయంలో చంద్రబాబు ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించారు’’ అని అంటూ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విరుకుచుకుపడ్డారు. పోలవరంను చంద్రబాబు నాశనం చేశారని.. టీడీపీ హయాంలో జరిగిన తప్పుల్ని తాము సరి చేస్తున్నామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని తమ ప్రభుత్వం భారీగా పెంచిందని.. దీనికి సంబంధించి జీవో కూడా ప్రచురించామని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి మేం గతంలో ఏం చెప్పామో.. దానికి సంబంధించి ఒక జీవోని 2021, జూన్ 30న జారీ చేశా. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మేం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రాజెక్ట్కు సంబంధించి గత ప్రభుత్వం ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద రూ.6.86 లక్షలు ప్రకటించారు. కానీ మేం అధికారంలోకి వస్తే.. ఆ మొత్తాన్ని 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం. అందుకు సంబంధించిన జీవో స్పష్టంగా ఉంది’’ అని తెలపడమే కాక.. అసెంబ్లీలో ఆ జీవోని చూపించారు సీఎం జగన్.
పోలవరం బాధితులకు ఇచ్చే పరిహారాన్ని లెక్క వేస్తే.. 500 కోట్ల రూపాయలు అవుతుందని.. ఆ మొత్తన్ని తప్పకుండా ఇస్తామని సీఎం జగన్ తెలిపారు. వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే అమ్మ ఒడి, ఆసారా వంటి పథకాలకు బటన్ నొక్కి డబ్బులు జమ చేస్తున్నామని.. అలానే పోలవరం నిర్వాసితులకు తప్పకుండా నష్టపరిహారం అందిజేస్తామని తెలిపారు. పునరావాసం పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. 14,110 మంది నిర్వాసితులుకు రూ. 19, 060 కోట్లతో పునరావాసం కల్పించామన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.