రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజునే శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అమరావతి అభివృద్ధికి ఉన్న ఆటంకాలు, మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని అంశం మరో మలుపు తిరిగింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం రాజధాని అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే ఏపీ రాజధాని అంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పు.. రాష్ట్ర శాసనవ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో ప్రస్తావించింది.
అంతేకాక రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలంటూ హైకోర్టు సూచించడం.. అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాక రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు వెల్లడించిన తీర్పును, ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఆదేశాలు అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. మూడు రాజధానుల చట్టం రద్దుపై జోక్యం చేసుకునే హక్కు హైకోర్టుకు లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది.
అభివృద్ధి వికేంద్రకరణ కోసమే తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. అంతేకాక.. ప్రభుత్వం మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసి.. దానిపై ఆలోచన చేస్తామని చెప్పిన తర్వాత.. తమ ప్రభుత్వం రూపొందించే నూతన చట్టం ఎలా ఉంటుందో తెలియకుండానే… హైకోర్టు తీర్పు ఇవ్వడం సరైనదేనా అంటూ పిటిషన్లో ప్రస్తావించింది.
అంతేకాక ఏపీ రాజధాని నిర్ణయం ఒక కమిటీ సూచన ప్రకారం ఉంటుందని విభజన చట్టంటలలోనే ఉందని తెలిపింది. కానీ కమిటీ సూచనతో సంబంధం లేకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయించారని వెల్లడించింది. ప్రస్తుతం దానినే రాజధానిగా ఉంచాలని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ప్రభుత్వం తన పిటిషన్లో ప్రశ్నించింది. అందుకే తక్షణమే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ప్రభుత్వ పిటీషన్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.