ఉద్యోగులు పంతం నెగ్గించుకున్నారు. పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం అయ్యింది. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ విజయవంతైనట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. పోలీసుల అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని సుమారు 50 వేల మంది ఉద్యోగులు విజయవాడ వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.ఇకపై మంత్రుల కమిటితో చర్చలు జరిపేది లేదని స్టీరింగ్ కమిటీ సభ్యులు తేల్చి చెప్పారు. సీఎం జగన్తో తప్ప మరెవరితో చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందుకొచ్చి ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు. ‘చలో విజయవాడ’ సందర్భంగా నిర్బంధించిన ఉద్యోగులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో తాము ఘర్షణ వాతావరణం కోరుకోవడంలేదన్నారు. గత మూడేళ్లుగా తమ ఆవేదనలు ప్రభుత్వానికి చెప్పాం.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.. అవమానపరిచారని స్టీరింగ్ కమిటి పేర్కొంది. ఈ క్రమంలో ఈనెల 5 నుంచి పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ చేస్తామని.. 6వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి : ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన సీఎం జగన్
‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతం కాకుండా చూసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. జిల్లాల నుంచి విజయవాడ బయల్దేరిన ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు చోట్ల చెక్ పోస్ట్ లు పెట్టి.. ఉద్యోగులను వెనక్కి పంపే ప్రయత్నం చేశారు. విజయవాడకు వైపు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు, అన్ని వాహనాలనూ తనిఖీ చేశారు. విజయవాడ వైపు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధికారులు, అన్ని వాహనాలనూ తనిఖీ చేశారు. వాహనాల్లో ఉన్నవారి ఐడీ కార్డులు, ఆధారాలు చెక్ చేస్తూ, అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని వాహనాలు దింపేసి వెనక్కు పంపించేశారు. కానీ, ‘చలో విజయవాడ’కు చాలా మంది ఉద్యోగులు కనకదుర్గ భక్తుల్లా, పెళ్లివారి వేషంలో విజయవాడలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.వేలాది ఉద్యోగులు పోలీసు ఆంక్షలు ఛేదించి బీఆర్టీఎస్ రోడ్డుకి చేరుకున్నారు. ఉద్యోగులు అక్కడ ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపైనే బైఠాయించారు. ఉద్యోగుల నిరసనను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు, 4జీ కిట్లు పనిచేయకుండా అధికారులు జామర్లు ఏర్పాటు చేశారు. ర్యాలీలు, ప్రసంగాలు, ధర్నాలు జరిగే ప్రాంతాలో కూడా వీటిని అమర్చారు. కానీ ఊహించని రీతిలో రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. పోలీసులు చేతులెత్తేశారు. విజయవాడ జన సంద్రమైంది. ఇక పలువురు జేఏసీ నాయకులు ‘చలో విజయవాడ’ నిరననల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ఉద్యోగ సంఘాలపై సజ్జల ఆగ్రహం.. బలప్రదర్శన సరికాదు
సీఎం జగన్ తో సజ్జల భేటీ
ఉద్యోగ సంఘాల ‘చలో విజయవాడ’ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో సీఎం జగన్ తో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎస్ సమీర్ శర్మ కూడా హాజరయ్యారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమం అనూహ్యంగా విజయవంతం కావడంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.