రోడ్డు ప్రమాదాలకు ర్యాష్ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం లాంటివి కారణం అవుతున్నాయి. అయితే కొన్నిసార్లు వెహికిల్స్లో సమస్యలు తలెత్తడంతోనూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.
రోడ్డు ప్రమాదాలు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అనే తేడాల్లేకుండా ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట యాక్సిడెంట్ అవుతోంది. ర్యాష్ డ్రైవింగ్, నిద్రమత్తులో బండి నడపడం, నిర్లక్ష్యం దీనికి కారణాలవుతున్నాయి. అయితే కొన్నిసార్లు వాహనాల్లో సమస్యలు తలెత్తడం వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోనూ ఈ తరహా ప్రమాదమే చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా, టోల్ప్లాజా దగ్గర ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఊహించని ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాస్తా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏపీ సచివాలయ ఉద్యోగులు 10 మంది గాయపడ్డారు. వెలగపూడిలోని సచివాలయ ఉద్యోగులు తమ విధులు ముగించుకొని సాయంత్రం ఆర్టీసీ బస్సులో ఇంటికి బయల్దేరారు.
వెలగపూడి నుంచి గుంటూరుకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తుండగా.. అకస్మాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. కాజా టోల్ ప్లాజా వద్ద ఉన్న సిమెంట్ దిమ్మెను ఢీకొట్టి బస్సును ఆపేశాడు. ఈ క్రమంలో బస్సు స్పీడుకు ముందు టైర్ విరిగిపోయింది. ప్రమాదం గురించి స్థానికులు అంబులెన్స్కు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో కాజా టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించడంతో.. ఆఖరుకు, వాహనాలు యథాతథంగా నడిచాయి.