ఉత్తరాఖండ్- చనిపోయాక మళ్లీ బతికి రావడం అనేది అసాధ్యం. అది కూడా అంత్యక్రియలు చేశాక మళ్లీ బతికి వచ్చిన ఘటన నమ్మశక్యంగా లేదు. ఓ వ్యక్తి చనిపోయాడని, అతనికి అంత్యక్రియలు నిర్వహించాక, ఏకంగా 24 ఏళ్ల తరువాత అతను బతికి రావడంతో కుటుంబంతో సహా ఉరివాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఏంటీ మీరు నమ్మడం లేదా.. ఐతే అసలు కధ తెలుసుకొండి.
ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోరా జిల్లా రాణిఖేత్ ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల మాదో సింగ్ మెహ్రా చాలా ఏళ్ల నుంచి కనిపించకుండా పోయారు. సుమారు పదేళ్ల పాటు అతని కోసం కుటుంబసభ్యులు ఎదురుచూశారు. తప్పిపోయిన కొత్తలో అతని కోసం వెతికి, ఇక లాభం లేదని ఊరుకున్నారు. పదేళ్ల తరువాత స్థానిత పండితుడి సూచన మేరకు చనిపోయాడని భావించి కుటుంబికులు అతడి ఫొటోకు దండేసి అంత్యక్రియలు జరిపారు.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు హఠాత్తుగా మాదో సింగ్ మెహ్రా బతికి వచ్చాడు. సరిగ్గా అతను తప్పిపోయి 24 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇంటికి తిరిగివచ్చాడు. దీంతో కుటుంబసభ్యులు, ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఐతే మాదో సింగ్ మెహ్రా ను ఇంట్లోకి మాత్రం రానివ్వలేదు. కనీసం ఆయన భార్యను కలవాడానికి కూడా ఒప్పుకోలేదు.
మాదో సింగ్ మెహ్రా కు అప్పటికే అంత్యక్రియలు జరిపిన నేపథ్యంలో చనిపోయినట్లేనని కుటుంబ సభ్యుల భావస్తారట. అందుకే స్థానిక పండితుడి సలహా మేరకు అతడిని మళ్లీ పుట్టినవాడిగా భావించి, అతడి నక్షత్రం, రాశి ఆధారంగా మళ్లీ పేరు పెట్టాలని నిర్ణయించారు. అంతవరకు గ్రామంలో టెంటు వేసి అందులో ఉంచారు మాదో సింగ్ మెహ్రా ను.