అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. అలా లక్ తలుపు తట్టినప్పుడు తీసిన వారు అదృష్టవంతులు అవుతారు. అలానే ఓ వ్యక్తికి అదృష్టం తలుపు కొట్టింది.. పేదరికంలో ఉన్నవాడు కాస్తా కోటీశ్వరుడు అయ్యాడు. ఏదో పెయింటింగ్ పై ఉన్న ఆసక్తితో కేవలం 2 వేల రూపాయలు పెట్టి కొన్న ఓ పెయింటింగ్, ఇప్పుడు అమాంతం 74 కోట్ల రూపాయల ధర పలికింది. వివరాల్లోకి వెళ్తే..
జర్మనీకి చెందిన క్లిఫోర్డ్ స్కోరర్ అనే వ్యక్తి ఆర్ట్ గ్యాలరీ కన్సల్టెంట్. అతను ఎక్కడైనా మంచి పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్స్ కనిపిస్తే కొంటుంటాడు. అలానే 2019లో మసాచుసెట్స్ కు వెళ్లిన సమయంలో ఓ బుక్ స్టోర్ లోకి వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ పెయింటింగ్ క్లిఫోర్డ్ ను బాగా ఆకర్షించింది. తన వద్ద తక్కువ మొత్తంలోనే డబ్బులు ఉన్నా.. 30 డాలర్ల(2వేల రూపాయలు)కు ఆ పెయింటింగ్ కొనుగోలు చేశాడు. పెయింటింగ్ లపై అనుభవం ఉన్న ఇతనికి ఈ చిత్రం చూడగానే ఏదో అనుమానం వచ్చింది. అది సాధారణ పెయింటింగ్ కాదని అతడు భావించాడు. దాని ప్రామాణికతను నిర్థారించేందుకు అతడు మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. అనేక ప్రాంతాల్లో తిరిగి ఎంతో సమాచారం సేకరించాడు. చివరకు క్లిఫోర్డ్ తెలుసుకున్న విషయం ఏంటంటే.. ఆ పెయింటింగ్ ను ప్రముఖ చిత్రకారుడు ‘ఆల్బ్రెచ్ డ్యూరర్’ గీశాడు.
జర్మనీ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ప్రముఖ చిత్రకారుడు డ్యూరర్ ఒకడు. 16వ శతాబ్దానికి చెందిన ఈ చిత్రకారుడు, ప్రపంచం మెచ్చిన అత్యుత్తమ కళాకారుల్లో ఒకడు. తన రచనలు, పెయింటింగ్స్ ద్వారా జర్మనీ పునరుజ్జీవనానికి ఎంతో కృషి చేశాడు. 1500 సంవత్సరంలో ఇతడు గీసిన పెయింటింగ్ పేరు “ది వర్జిన్ అండ్ ఏ ఛైల్డ్”. ఆ కాలంలో ఈ పెయింటింగ్ కు ఎంతో ఆదరణ ఉంది. ఇప్పుడు క్లీఫోర్డ్ చేతిలో ఉన్న పెయింటింగ్ అదే. దీని విలువ తెలుసుకుని దానిని వేలం పాటకు పెట్టాడు. ఆ వేలం పాటలో అక్షరాలా 74 కోట్ల రూపాయలు ధర పలికింది. మనకు ఆసక్తి ఉన్న వాటిని తీక్షణంగా పరిశీలిస్తే.. వాటిలో దాగున్న విలువ తెలుసుకోవచ్చు. అలా పరిశీలించిన క్లీఫోర్డ్ అదృష్టవంతుడయ్యాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.