చాలా మంది గమనించే ఉంటారు. 40, 50 ఏళ్లు దాటిన పెద్ద వాళ్ళు టీనేజ్ అమ్మాయిల్లా ప్రవర్తిస్తుంటారు. ఒంటి నిండా బంగారం వేసుకోవడం, ఖరీదైన చీరలు కట్టుకోవడం, స్టైల్ గా ఉండాలని తాపత్రయపడటం వంటి చేష్టలు మీరు గమనించే ఉంటారు. మనవళ్లు, మనవరాళ్లతో అమ్మమ్మ, నాన్నమ్మ అని పిలిపించుకునే వయసులో కూడా స్టైల్ ని మెయింటెయిన్ చేస్తుంటారు. మహిళలే కాదు.. తాత వయసున్న మగాళ్లు కూడా స్టైల్ ని మెయింటెయిన్ చేస్తుంటారు. మగాళ్లు తమను తాము హీరోలుగా, ఆడవాళ్లు తమను తాము హీరోయిన్లుగా ఫీలవుతూ మురిసిపోతుంటారు. దీన్ని చాలా మంది తప్పుపడుతుంటారు. ‘చూసావా.. ఎదురింటి పద్మకి స్టైల్ పెరిగిపోయింది. ఈ వయసులో బంగారం, ఖరీదైన చీరలు అవసరమా? పిల్లలు పెళ్లిళ్లు అయ్యాక దానికి ఆ సోకులు తక్కువచ్చాయా?’ అని దెప్పి పొడుస్తుంటారు. ఇవి పల్లెటూర్లలో ఎక్కువగా వినిపించే మాటలు.
ఇంట్లో వాళ్లకి కూడా ఇరుగుపొరుగు వాళ్ళు అన్న మాటలు నిజమే కదా అని అనుకుంటారు. కానీ దాని వెనుక ఉన్న ఎమోషన్ ని ఎవరూ గుర్తించరు. కనీసం గుర్తించే ప్రయత్నం చేయరు. అమ్మా, ఈ వయసులో నీకెందుకే అని పుసుక్కున ఒక మాట అనేసి బాధ పెట్టేస్తారు. ముసలోడికి దసరా పండుగ అని నాన్నని అనేస్తారు. కానీ దీని వెనుక ఉన్న సైకలాజికల్ థింగ్ ని ఎవరూ అర్థం చేసుకోరు. ఇది మనసుకు సంబంధించిన విషయం. అందుకే ఆ వయసులో వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటారు. అలా అని ఇదేమీ మానసిక వ్యాధి కాదు. ఒకప్పుడు వాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలన్న బలమైన కోరిక నుండి పుట్టిన మానసిక సంతోషం. పెళ్లయినప్పటి నుంచి బాధ్యతల పేరుతో ఎన్నో త్యాగాలు చేస్తారు.
బాగా పేదరికం నుంచో.. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచో అత్తారింట్లో అడుగుపెడతారు. తినడానికి తిండి కూడా సరిగా లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అత్తా, మామల కోసం త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పిల్లలు పుట్టాక వాళ్ళ కోసం ఆలోచించాల్సి ఉంటుంది. పిల్లల ఆనందం కోసం వాళ్ళ చిన్న చిన్న ఆనందాలను పక్కన పెట్టేస్తారు. అదృష్టం బాగుండి పిల్లలకు కొంత వయసు వచ్చేసరికి తల్లిదండ్రుల ఆర్థిక స్థితి బాగుంటుంది. దీంతో వాళ్ళు అప్పటి నుంచే గతంలో కోల్పోయిన ఆనందాలను పొందుతుంటారు. కానీ కొంతమందికి పిల్లలకు ఉద్యోగం వచ్చి.. పెళ్లిళ్లు చేసే వరకూ కూడా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబ బాధ్యతల్లో పడి బంగారం మీద, ఖరీదైన బట్టల మీద వ్యామోహం ఉండదు.
ఎప్పుడైతే పిల్లలకు ఉద్యోగాలు వచ్చి.. పెళ్లిళ్లు చేసి.. తమ బాధ్యత తీరింది అని ఊపిరి పీల్చుకుంటారో.. అప్పటి నుంచి వారు తమ గతంలో కోల్పోయిన ఆనందాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. మహిళలే కాదు.. మగాళ్లు కూడా ఈ విషయంలో రాజీ పడరు. దీనికి కారణం బాధ్యతలతో కూడిన ఒత్తిడి లేకపోవడం. ఒత్తిడి లేకపోవడం వల్ల వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పటి వరకూ తమ గురించి ఆలోచించుకోని వారికి.. ఆలోచించుకునే అవకాశం వస్తుంది. మరో కారణం కూడా ఉంది. మనిషి జన్మ.. పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకూ ఒక చక్రం. ఆ చక్రం ప్రకారం మనిషి పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో.. చనిపోయే దశ ముందు కూడా అలానే ఉంటాడు.
కడుపులో ఉన్నప్పుడు బిడ్డ దగ్గరకు ముడుచుకుని ఎలా ఉంటాడో.. అలానే వృద్ధాప్యం వచ్చాక మనుషులు కూడా నడుము వంగిపోయి బిడ్డలా అయిపోతారు. ప్రవర్తన కూడా పిల్లల్లానే ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలు మారాం చేసినట్టే.. వృద్ధాప్యంలో చాదస్తం పెరిగిపోతుంది. ఇదంతా హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లలతోనే సమానం అని అంటారు. కానీ ఇదేమీ అర్థం చేసుకోకుండా పాపం వాళ్ళని విమర్శిస్తుంటారు. నిజానికి అలా విమర్శించే వాళ్లదే మానసిక వ్యాధి అని నిపుణులు అంటారు. అయినా నచ్చినట్టు ఉండడం, ఒకప్పుడు కోల్పోయిన సంతోషాలను ఒక వయసు వచ్చాక అనుభవించడం క్రైమ్ కాదు కదా అని ఒక వర్గం అనే మాట.
వీరి వల్ల ఎవరికీ అన్యాయం జరగడం లేదు కదా.. ఇంకా వీరి వల్ల నగల వ్యాపారులు, చీరల వ్యాపారులు బాగుపడుతున్నారు. వీళ్ళ వల్ల మంచి బిజినెస్ జరుగుతుందంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి అని పాజిటివ్ గా ఆలోచించేవాళ్ళు ఉంటారు. అలా ఆలోచిస్తే ఏ బాధలూ ఉండవు. సంతోషంగా ఉన్న వాళ్ళని సంతోషంగా ఉండనివ్వడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. మనిషిని సంతోషంగా ఉండనివ్వం కంటే ఉండనివ్వడం అనేది గొప్ప విషయంగా మీరు భావిస్తున్నారా? పెద్దలు టీనేజ్ వయసున్న వారిలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసుకున్నారు కదా. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.