హైదరాబాద్ లోని ఓ యువతి తన బండి కాన్వాయ్ కి అడ్డుపెట్టి.. ఎస్కార్ట్ పోలీసులపై వాగ్వాదానికి దిగింది. సైరన్ మోగించినందుకు ఆమెకు చిర్రెత్తుకొచ్చి వారి మీద విరుచుకుపడింది. పాయింట్లు మాట్లాడుతూ చెమటలు పట్టించింది. ఇంతకే కాన్వాయ్ చేసిన తప్పేంటి?
ప్రజల కోసం పని చేసే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పనులు త్వరగా అవ్వాలంటే అందరిలా వెళ్ళకూడదు. వారి కోసం రోడ్లు ఖాళీగా పెట్టాల్సిందే. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న కాన్వాయ్ సైరన్ మోగిస్తూ రోడ్ల మీద వెళ్లే 10 నిమిషాల ముందే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను ఆపేస్తారు. ఇబ్బంది పడినా మన కోసమే కదా పని చేస్తున్నారు.. సర్లే పోనీ అని సర్దుకుపోతారు. కానీ ఒక యువతి మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించింది. అంతేకాదు.. మంత్రి కాన్వాయ్ అయితే ఏంటి అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. సోమాజిగూడలో ఓ యువతి మంత్రుల కాన్వాయ్ పై విరుచుకుపడింది. దెబ్బకి ఎస్కార్ట్ పోలీసులే హడలిపోయారు.
ఆ యువతి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి బంజారాహిల్స్ వైపు స్కూటీ మీద వెళ్తుంది. ఎర్రమంజిల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఆమె వెళ్తున్న మార్గంలోనే మంత్రుల ప్రోటోకాల్ కాన్వాయ్ వెళ్తుంది. ఆ కాన్వాయ్ లోని ఓ పైలట్.. వాహనం యొక్క సైరన్ మోగిస్తూ వెళ్తున్నాడు. ఆ వాహనం ముందే యువతి స్కూటీ మీద వెళ్తుంది. చాలా సేపు భరించిన ఆ యువతి.. ఎంతకీ సైరన్ ఆపకపోవడంతో సహనం కోల్పోయింది. ట్రాఫిక్ జామ్ అయినా సరే సైరన్ మోగిస్తుండడంతో పైలట్ మీద విరుచుకుపడింది. తన వాహనాన్ని కాన్వాయ్ కి అడ్డంగా పెట్టి పైలట్ ని బయటకు రమ్మని పిలిచి వాగ్వాదానికి దిగింది. హెల్మెట్ తో వాహనం బానెట్ పై గట్టిగా కొట్టి.. అసలేం అనుకుంటున్నారు అంటూ వారి మీద నిప్పులు చెరిగింది.
భారీ ట్రాఫిక్ ఏర్పడితే ఎలా వెళ్తారు.. మైండ్ పని చేయడం లేదా అంటూ ప్రశ్నించింది. కాన్వాయ్ లో అధికారులు, మంత్రులు లేకపోయినా ఎందుకు సైరన్ మోగిస్తున్నారని, ముందు అంత భారీ ట్రాఫిక్ జామ్ అయితే కనిపించడం లేదా అంటూ పోలీసులను నిలదీసింది. ప్రజల కోసం పని చేసే మంత్రులు, వీఐపీలు వెళ్తుంటే మేమెందుకు దారివ్వాలి అంటూ ప్రశ్నించింది. గట్టిగా వానలు పడితే నగరంలో రోడ్లపై డ్రైనేజీలు పొంగి.. ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పట్టించుకోని మంత్రులకు ఎందుకు దారి క్లియర్ చేయాలి అంటూ ఆ యువతి మండిపడింది. మంత్రులకే కాదు.. ప్రజలకు కూడా అత్యవసర పనులు ఉంటాయని ఆమె వాదించింది.
ఇదంతా ఎస్కార్ట్ వాహనంలో ఉన్న పోలీసులు తమ ఫోన్ లో రికార్డు చేశారు. మరోవైపు వాహనదారులు కూడా రికార్డు చేశారు. అయితే ఈ ఘటనలో యువతి తప్పు లేదని అంటున్నారు. ఆమె ధైర్యానికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లేకపోయినా కొందరు సైరన్లు మోగిస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆ మధ్య ఒక అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగించుకుంటూ వెళ్లి బజ్జీలు కొనుక్కున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు.. అనవసరంగా సరైన మోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.