దాచుకున్న బంగారం వస్తువులు దొంగతనానికి గురైతే.. దొరకడం కష్టం. అయితే ఆ వస్తువులు దొరకడమే కాదూ.. పోలీసుల ప్రమేయం లేకుండా పోయిన ఇంట్లోనే లభించాయి. దీంతో బాధితుల ఆనందానికి అవధుల్లేవు. ఈ వింత దొంగతనం తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొత్తును కానీ బంగారం, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారంటే.. ఆ కుటుంబం లబోదిబో అనాల్సిందే. కొంత సేపు బాధపడ్డాక.. చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. మన సొత్తు తిరిగి దక్కకపోతుందా అని ఆశతో ఎదురు చూస్తాం. కానీ ఒక్కసారి దొంగలు దోచుకెళ్లిన వస్తువులు తిరిగి మనకు దక్కుతాయనుకోవడం కల్లే. కానీ దొరికితే మనంతా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. సరిగ్గా ఇటువంటి వింత దొంగతనమే జరిగింది తెలంగాణలో. దొంగలు కొట్టేసిన సొమ్ము తిరిగి వారి ఇంటికే చేరింది. దీంతో ఆ కుటుంబానికి ఆనందానికి అవధుల్లేవు. అయితే అక్కడే వారికొక అనుమానం వచ్చింది. ఎందుకంటే.. ఒక్కసారి దొంగతనానికి గురైన వస్తువులు తిరిగి దొరకడం.. అందులోనూ పోయిన ఇంట్లోనే దొరకడమంటే మామూలు విషయం కాదు. ఈ వింత దొంగతనం వరంగల్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే కిల్లా వరంగల్లోని బోల్లికుంటకు చెందిన గోలికార్ గోపి కుటుంబం నివసిస్తోంది. వారిది ఉమ్మడి కుటుంబం. ముగ్గురు అన్నదమ్ములు కలిసి జీవిస్తున్నారు. గత వారం వారి ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవ్వరి లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి దాదాపు 30 తులాల బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ విషయం తెలిసిన కుటుంబం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ మెట్టెక్కారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్స్ స్వాడ్ సాయంతో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. ఈ చోరీ ఘటన అంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీసులు పట్టుకుంటారన్న భయంతో దొంగతనం జరిగిన వారం తర్వాత అదే ఇంటి ప్రహరీలో దోచుకున్న సొత్తును పడేసి వెళ్లిపోయారు దొంగలు.
ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బంగారు ఆభరణాలను దొంగలు పడేశారు. పోయిన సొత్తంతా తిరిగి ప్రత్యక్షమయ్యేసరికి బాధితుల కుటుంబాల్లో ఆశ్చర్యంతో పాటు ఆనందం వెల్లువిరిసింది. అయితే ఆ సొత్తులో కూడా మూడు తులాలు మిస్సయ్యిందని చెబుతున్నారు. అలాగే పోయిన వస్తువులు ఇంటి వద్దే పడేయడంతో పలు అనుమానాలకు తావునిచ్చినట్లయింది. ఇంటి దొంగల పనేనా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఈ దొంగతనం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఎవరూ ఈ దొంగ అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంట్లో వారి పనేనా, లేదంటే బాగా తెలిసిన వారే దీనికి ఈ దొంగతనానికి ఒడిగట్టారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.