హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ పై పిడుగు పడింది. అపార్ట్మెంట్ లో 40 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ ఘటనలో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయాయి.
ప్రస్తుతం తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే భారీ వర్షం కారణంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్ లోని వాసుదేవ నగర్ హంసరాజ్ ఎంక్లేవ్ అపార్ట్మెంట్ మీద పిడుగు పడింది. పిడుగు పడడంతో ఒక్కసారిగా లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు కాలిపోయాయి. అపార్ట్మెంట్ గోడ స్వల్పంగా ధ్వంసమైంది. ఈ అపార్ట్మెంట్ లో మొత్తం 40 కుటుంబాలు నివసిస్తున్నాయి.
భారీ శబ్దంతో పిడుగు పడడంతో అపార్ట్మెంట్ లో ఉంటున్న జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ హాని కలగలేదు. కొన్ని ఫ్లాట్స్ లో విద్యుత్ వైరింగ్ కాలిపోయింది స్థానికులు చెబుతున్నారు. రాత్రంతా కరెంట్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని అపార్ట్మెంట్ వాసులు చెబుతున్నారు. పిడుగు పడే సమయంలో ఒక వ్యక్తి రోడ్డు మీద ఉన్నాడు. అదృష్టవశాత్తు అతను ఆ పిడుగు నుంచి తప్పించుకున్నారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వడంతో వైరల్ గా మారాయి.