ప్రభుత్వ విద్యాసంస్థల్లో చాలా వాటిల్లో మౌలిక వసతుల కొరతతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. ఓ సర్కారు కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
అదేమీ మారుమూల ప్రాంతం కాదు. నగరానికి నడిబొడ్డున ఉన్న ప్రాంతం. కానీ అక్కడి ప్రభుత్వ కళాశాలలో మాత్రం వసతులు కరువయ్యాయి. దాదాపు 700 మంది విద్యార్థినులకు ఒకటే మూత్రశాల ఉందంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మూత్రశాలలు లేక స్టూడెంట్స్ అవస్థలు పడుతున్నారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించాలంటూ గత కొన్ని నెలలుగా ఆందోళన బాట పట్టారు హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు. కాలేజీలో కనీస సదుపాయాల ఏర్పాటుపై అధికారులకు కంప్లయింట్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో క్లాసులు బహిష్కరించి భారీ నిరసన చేపట్టారు స్టూడెంట్స్.
విద్యార్థినులు తమ సమస్యలపై హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై స్పందిచిన కోర్టు.. అంతమంది స్టూడెంట్స్కు ఒకే టాయ్లెట్ ఉండటంపై సీరియస్ అయింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన వసతుల కల్పన కోసం ఏ చర్యలు చేపడుతున్నారో చెప్పాలంటూ రాష్ట్ర సర్కారును హైకోర్టు ప్రశ్నించింది. తక్షణమే ప్రభుత్వ విద్యాసంస్థల్లో బాలికలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్, విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 25వ తేదీలోగా విద్యాసంస్థల్లోని వసతులపై నివేదిక ఇవ్వాలని సర్కారును హైకోర్టు ఆదేశించింది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.