సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ రావు అరాచకాలన్నీ మళ్లీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బయటకేమో మంచి వాడిలా ఉంటూ.. సామాన్యులను, సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. తాజాగా మరో కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేసిన కేసులో శ్రీధర్ రావును ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 250 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలున్నాయి. ట్రాక్టర్లు ఇప్పిస్తానని చెప్పి రూ. 250 కోట్ల మేర వసూలు చేసినట్లు అమితాబ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్కు చేరుకుని శ్రీధర్ను ఆదివారం అరెస్టు చేసింది. మోసాలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడటం ఇది నాలుగోసారి. మధ్య తరగతి నుండి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ పెద్ద మొత్తంలో చీటింగ్ చేస్తూ పలుమార్లు దొరికిపోయారు.
అమితాబ్ బచ్చన్ బంధువులను చీటింగ్ చేసిన కేసులో తాజాగా అరెస్టైన ఆయనను రాజేంద్ర నగర్ కోర్టులో ఢిల్లీ పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఆయనను ఢిల్లీకి తరలించనున్నారు. గతంలో కూడా గబ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్పై దాడి చేసిన శ్రీధర్ రావు తెరపైకి రావడంతో బాధితులంతా పోలీస్స్టేషన్లకు క్యూ కడుతున్నారు. శ్రీధర్ రావు అరాచకాలన్నీ మళ్లీ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడి చేస్తున్న సీసీటీవీ దృశ్యాలు బయటికి రావడంతో శ్రీధర్ రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీధర్రావుపై కంప్లైంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటున్న తనను శ్రీధర్రావు ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఖుషీ చంద్ అనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. షాపును తెరవిన్వకుండా, వ్యాపారాన్ని చేయనివ్వకుండా తన మనుషులతో దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గతంలో మాదాపూర్, రాయదుర్గంలో కూడా పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయనను అరెస్టు చేయగా బెయిల్ పై విడుదలయ్యారు. అయినప్పటికీ ఇంకా మోసాలు పాల్పడుతూనే ఉన్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీలను మోసం చేస్తున్న ఇటువంటి వ్యక్తులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.