ఈ మద్య దేశంలో పలు చోట్ల రైలు ఫ్లాట్ ఫామ్స్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్ నుంచి దిగడం, ఎక్కడం లాంటివి చేసే సమయంలో అనుకోకుండా ప్రమాదాలకు గురి అవుతున్నారు.
ఈ మద్య కాలంలో రైల్వే స్టేషన్లలో ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోతుంది. రైలు ఎక్కేటపుడు.. దిగేటపుడు పట్టు కోల్పోయి చాలా మంది ఫ్లాట్ ఫామ్ మద్యలో పడిపోతూ తీవ్ర గాయాలపాలవుతున్నారు.. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రైలు కదిలే సమయంలో దూరంగా ఉండాలని రైల్వే అధికారులు ఎన్నిసార్లు చెప్పినా.. పదే పదే అదే తప్పు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు ప్రయాణికులు. తాజాగా ఓ మహిళ కదిలే రైలు దిగుతున్న సమయంలో పట్టు కోల్పోయి.. ఫ్లాట్ ఫామ్ లో ఇరుక్కుపోయింది. వెంటనే మహిళా కానిస్టేబుల్ వచ్చి ఆమెను రక్షించింది. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలు మణుగూరు నుంచి సికింద్రాబాద్ కు వెళ్తుండగా ట్రైన్ వరంగల్ రైల్వే స్టేషన్ లో వచ్చింది. రైలు ఫ్లాట్ ఫామ్ పై ఆగే సమయంలో ట్రైన్ కాస్త స్లో అయ్యింది.. ఓ మహిళ రైలు దిగే ప్రయత్నం చేసింది.. అంతలోనే పట్టు తప్పిపోయి ఫ్లాట్ ఫామ్, రైలుకు మద్య ఇరుక్కుపోయింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ సోనాలి మాల్కే వెంటనే స్పందించి సదరు మహిళను రైలు నుంచి దూరంగా లాగివేసింది.. దీంతో పెద్ద ప్రమాదం నుంచి ఆ మహిళ తప్పించుకుంది. సమయానికి సదరు మహిళా కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ప్రదర్శించి ప్రయాణికురాలి ప్రాణాలు రక్షించడానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ క్రమంలో ప్రాణాలకు తెగించి కాపాడిన సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణికులు అభినందించారు.
ఫ్లాట్ ఫామ్ పై ట్రైన్ పూర్తిగా ఆగిన తర్వాతనే ఎక్కడం, దిగడం లాంటివి చేయాలని రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నిసార్లు చెప్పినా.. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతూనే ఉన్నాయి. రెప్పపాటులో జరిగిపోతున్న ఈ ప్రమాదాల నుంచి ఎన్నోసార్లు రైల్వే పోలీసులు ప్రయాణికుల ప్రాణాలు కాపాడుతున్నారు. క్షణం ఆలస్యం అయినా పరవాలేదు.. కానీ తొందరపడి కదిలే ట్రైన్ ఎక్కడం, దిగడం లాంటివి చేయవద్దని.. అలాగే ఫాస్ట్ గా కదులుతున్న ట్రైన్ సమీపంలో కూడా నిలవరాదని అధికారులు చెబుతున్నారు.