మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ సహద్దుల్లోని బీజాపూర్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు సమాచారం. బుధవారం ఉదయం బీజాపూర్ అడవుల్లో సీఆర్పీఎఫ్ దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. వీరిలో హిడ్మా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే హిడ్మా ఎన్కౌంటర్ను పోలీసులు కానీ, మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు.
హిడ్మాపై రూ. 45 లక్షల రివార్డు ఉంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉంటుంది. హిడ్మా భద్రత దళాలకు మోస్ట్ వాంటెడ్. దండకారణ్యంలో జరిగే ప్రతి దాడి వెనుకా ఆయన హస్తం ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. బస్తర్, సుక్మా, దంతేవాడ, బీజాపూర్ ప్రాంతాల్లో అతనికి గట్టి పట్టుందని చెప్తుంటారు. దండకారణ్యంలోని ఆదివాసీలతో సత్సంబంధాలు ఉన్నాయట.
ఎవరీ హిడ్మా.. ?
హిడ్మా.. ఛత్తీస్గఢ్, బస్తర్ జిల్లా పూవర్తిలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు. పదిహేనేళ్ల వయస్సులోనే(1990) అప్పటి పీపుల్స్వార్లో సభ్యుడిగా చేరారు. అంచెలు ఆచెలుగా ఎదుగుతూ కమాండర్గా ఎదిగారు. రాను.. రాను.. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)లో కీలక నేతగా మారాడు. ఈ దళంలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారని పేరు. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను వీరు ఉపయోగిస్తారట. వీరు పూర్తిగా యూనిఫామ్లో ఉంటారని పేరు. ఎరవేసి దాడులు చేయడంలో హిడ్మా సిద్ధహస్తుడట. చదివింది అయిదో తరగతి అయిన హిందీ, ఇంగ్లీషు భాషలను అలవోకగా మాటలుగలదట. అతడి వ్యూహంలో చిక్కుకుంటే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం అనిచెప్తుంటారు. అందుకే అతడిని మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఎన్నుకున్నారని ప్రచారం.ప్రస్తుతం హిడ్మా దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.