ఈ ఏడాది వేసవికాలంలో కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా కురిసిన వడగళ్ల వానతో అన్నదాతలకు కడగళ్లు మిగిలాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి రైతులకు పంట నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ. 10వేలు జమచేస్తున్నారు.
ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అయిన వెంటనే పలుచోట్ల వడగళ్ల వానలు కూడా కురిసాయి. తెలంగాణలో ఈ సంవత్సరం వేసవిలో విభిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో భారీ వడగళ్ల వాన నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు రైతులు చాలా పంటలు నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, కూరగాయలు, పత్తి ఇంకా పండ్ల తోటల్లో కూడా నష్టం వాటిల్లింది. పంటల నష్టాలతో అన్నదాతలు కన్నీటిపర్యంతమయ్యారు. వరి పూర్తిగా నీట మునిగి ఒడ్లు మొలకలు వచ్చాయి. ఎటు పాలుపోని రైతులు నెత్తికి చేతులు పెట్టుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, వరంగల్,కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు. అన్నదాతలకు ఎకరాకు రూ. 10 వేలు చొప్పున పంట నష్టపరిహారంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లిస్తూ.. వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు రైతులకు నష్ట పరిహారం చెక్కుల రూపంలో అందించేవారు. చెక్కులు అందజేయుటతో మరింత ఆలస్యం అవుతుందని నేరుగా రైతుల అకౌంట్లలోకి నగదు బదిలీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
ఇందుకుగాను వ్యవసాయశాఖ సర్వే జరిపి.. 26 జిల్లాల్లో 1,51,645 ఎకరాల నష్టం జరిగిందని తేల్చింది. 1,30,988 మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో పంట నష్ట పరిహారం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధులు జిల్లాల వారిగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లోకి వేయాలని నిర్ణయించారు. మహబూబ్నగర్ జిల్లాలో 12,684 మంది అన్నదాతల ఖాతాల్లో నగదు జమ చేశారు. మిగతా జిల్లాల్లోనూ రానున్న రెండు రోజుల్లో నగదు జమ చేడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.