మణిపూర్ లో జరిగిన విషాదం ఘటన దేశం మొత్తంగా సంచలనం రేపింది. మహిళలను నగ్నంగా కొందరు దుండగులు ఊరేగించడం సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. అసలు జరిగిన విషయాలు ఏంటో తెలుసుకుందాం..
మణిపూర్లో గత రెండున్నర నెలలుగా హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముగ్గురి మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళలకు భద్రత లేకుండా పోతుంది. భరతమాత అని కొలిచే దేశంలో ఆడవారికి పట్టిన దుస్థితిని చూసి ప్రపంచం అంతా కన్నీరు పెడుతుంది. ఈ విషాద సంఘటన జరిగిన నేపథ్యంలో బాధితురాలి తల్లి ఒకరు ఆవేదనతో కీలక వ్యాఖ్యలు చేశారు. తన కూతురికి జరిగిన దారుణానికి గుండెలవిసిపోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కళ్లనీళ్ళు పెట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ క్రమంలో ఆమె మట్లాడుతూ.. మణిపూర్లో హింసను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్నారు. తనభర్తను, కుమారుడిని చంపేశారని తెలిపారు. కొంతమంది గుంపు మా ఇంటివైపు వచ్చి ఈ దారుణానికి తెగబడ్డారని.. పోలీసులు ఇద్దరు మహిళలను గుంపులోకి వదిలేశారు. వారు నగ్నంగా ఊరేగించారని ఆవేదన చెందారు. ఈ ఘర్షణలో తన చిన్నకొడుకును కోల్పోయినట్లు.. అతని చదువు కోసం చాలా తాపత్రయపడ్డామని తెలిపారు. ప్రస్తుతం తన పెద్ద కుమారునికి ఏ ఉద్యోగం లేదని.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తేనే భయంగా ఉందని కంటతడి పెట్టుకున్నారు.
ఈ సమయంలో తిరిగి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు తమకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. వారి ఇళ్లు తగులబెట్టారని, పంట పొలాలను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి గ్రామమే మంటల్లో కాలిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రిని, తమ్ముడిని తన కళ్ల ముందే చంపేయడం కూతురు చూసిందని చెప్పారు. ఇది తన హృదయాన్ని గాయపరిచిందని తెలిపారు. దీని గురించి రాత్రి, పగలు ఆలోచించి మానసికంగా క్రుంగిపోవడంతో బలహీనంగా ఉందని.. డాక్టర్ వద్దకు వెళ్లినట్లు తెలిపారు.
మణిపూర్ దారుణ ఘటనపై ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ గురువారం ఉదయం లైవ్ ద్వారా స్పందన తెలిపారు. ‘ఘటనపై బాధగా ఉంది. మానవత్వానికి వ్యతిరేకమైన ఈ ఘటను.. ప్రతీ ఒక్కరూ ఖండించాలి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించాం. వారికి మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.