దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏవైనా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొంత మంది ప్రమాదంలో వికలాంగులుగా మారిపోతున్నారు. ఎంతో మంది అనాథలుగా మిగిలిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా మితిమీరిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బానోత్ భద్రునాయక్ తన దూరపు బంధువు మధు ఇటీవల కొత్త లారీలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబ సభ్యులు షరీఫ్ దర్గా వద్ద ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి భద్రునాయక్ కుటుంబ సభ్యులతో కారులో బయలుదేరారు. షరీఫ్ దర్గా దర్శనం చేసుకొని పండుగ చేసుకున్న వారంతా తిరిగి టేకులపల్లికి బయలుదేరారు. అదే పండుగకు వచ్చిన గుగులోత్ లలిత ఆమె కుమారుడు సురేష్ లిఫ్ట్ టేకులపల్లికి వస్తామని అడగడంతో కారులో ఎక్కించుకున్నారు. వారు బయలుదేరే సమయానికి చికటిపడింది.
కేసముద్రం వద్ద కారు అదుపు తప్పి పక్కన ఉన్న వ్యవసాయబావిలోకి దూసుకు వెళ్లింది. ఆ సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో భద్రునాయక్ అతని భార్య హచ్చాలి తోపాటు లిఫ్ట్ అడిగి కారు ఎక్కిన లలిత ఆమె కుమారుడు సురేష్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. కారు ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ కంకర రాళ్లు ఉండటంతో అదుపు తప్పి బావిలో పడినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు ప్రాణాలకు తెగించి బావిలో దూకి కారు అద్దాలు పగులగొట్టి ముందు సీట్లో ఉన్న డ్రైవర్ బిక్కు, సుమలత ఆమె కొడుకు దీక్షిత్ ని కాపాడగలిగారు.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు మూడు గంటల పాటు కష్టపడి క్రేన్ సహాయంతో బావిలో ఉన్న కారును బయటకు తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను మహబూబాబాద్ హిస్పిటల్ కి తరలించారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారే విషాదఛాయలు అలుముకున్నాయి.