చెట్టంత ఎదిగిన కొడుకు తల్లిదండ్రుల కళ్లముందే కుప్పకూలి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది. తాజాగా అదే జరిగింది ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో. ఆ యువకుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అసలేం జరిగిందంటే?
గత కొన్నిరోజుల నుంచి వరుస గుండెపోటు మరణాలు ప్రజలను తీవ్ర భయందోళనలకు గురి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి హార్ట్ ఎటాక్ వస్తుంది. దీని కారణంగా రోజుకు ఎంతో మంది ప్రాణాలు విడిస్తున్నారు. ఉన్నట్టుండి గుండెపోటు సమస్యతో జనాలు మృతి చెందుతుండడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇదిలా ఉండగానే తాజాగా గుండెపోటుతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది
తెలంగాణలో ఖమ్మం జిల్లా బోనకల్లు పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామం. ఇక్కడే మరీదు రాకేష్ (18) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఈ కుర్రాడు స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అయితే ఆదివారం రాకేష్ తన ఇంటి వద్ద అప్పటి వరకు స్నేహితులతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ యువకుడు కుప్పకూలాడు. వెంటనే గమనించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు.. ఇతను గుండెపోటుతో అప్పటికే మరణించాడని తెలిపారు. వైద్యుల మాటలు విన్న రాకేష్ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. చెట్టంత ఎదిగిన కొడుకు కళ్లముందే కుప్పకూలి చనిపోవడంతో ఆ యువకుడిని కనిపెంచిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ వార్తతో వీరి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే 18 ఏళ్ల వయసులోనే రాకేష్ గుండెపోటు సమస్యతో మరణించడంతో గ్రామస్తులు అంతా భయందోళనలకు గురవుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.