తమ కష్టాలను తీర్చే కొడుకులు ఉన్నారని సంబరపడ్డారు తల్లిదండ్రులు. ఇద్దరు అన్నాదమ్మలు రామ లక్ష్మణుల్లా, ఒకరి మాటంటే మరొకరు గౌరవిస్తూ, ఎంతో అభిమానంగా ఉంటున్నారు . అలాంటిది ఏ కన్నుకుట్టిందో తెలియదు కానీ.. ఒక నెలలో రోజుల వ్యవధిలో ఇద్దరూ తిరిగి రాని లోకాలకు మరలిపోయారు
తమ కష్టాలను తీర్చే కొడుకులు ఉన్నారని సంబరపడ్డారు తల్లిదండ్రులు. ఇద్దరు అన్నాదమ్ములు రామ లక్ష్మణుల్లా, ఒకరి మాటంటే మరొకరు గౌరవిస్తూ, ఎంతో అభిమానంగా ఉంటున్నారు . అలాంటిది ఏ కన్నుకుట్టిందో తెలియదు కానీ.. ఒక నెలలో రోజుల వ్యవధిలో ఇద్దరూ తిరిగి రాని లోకాలకు మరలిపోయారు. చేతికొచ్చిన కొడుకులు ఇద్దరు రోజుల వ్యవధిలో.. అందులోనే ఒకే రకంగా చనిపోవడంతో తల్లిదండ్రుల పుత్రశోకం చెప్పనలనిది కాదు. తల్లిదండ్రులు ఒంటరిని చేసి.. చావులోనూ వీడిపోని బంధంగా మారారు ఈ అన్నాదమ్ములు. గుండెలను పిండేసే ఈ విషాదం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రోజుల వ్యవధిలోనే అన్నాదమ్ములిద్దరూ గుండెపోటుతో చనిపోయి.. తల్లిదండ్రులకు పుత్ర శోకాన్ని మిగిల్చారు. రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి, అరుణ దంపతులు. వీరికి ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి (30), ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ నగరంలో ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. మధు హైదరాబాద్ నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 3న మధుకి ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గుండె పోటుతో మరణించారు. ఆ తర్వాత గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నకుమారుడు చనిపోయాడ్న బాధలో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.
తమ్ముడి మరణ వార్త జీర్ణించుకోలేకపోయాడు అన్న. ఆదివారం మధుసూదన్ రెడ్డి చిన్న కర్మలు నిర్వహించారు. ఆ ఏర్పాట్లు పర్యవేక్షించిన శ్రీకాంత్ ఉన్నట్లుండి గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అదే రోజు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షలు నిర్వహించి నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని నిమ్స్కు తరలించగా.. అక్కడి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. అయినా అతడి ఆరోగ్యం కుదటపడకపోగా.. పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం కన్నుమూశాడు. రోజుల వ్యవధిలోనే ఇద్దరు కొడుకులు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతమౌతుంది. వారిని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావడం లేదు.