ఎవరికో నివాసం లేదని వారికి రూ. 2 కోట్ల విలువ చేసే ఇంటిని రాసిచ్చేశారు. అద్దె ఇళ్లలో శవాన్ని ఉంచనివ్వడం లేదని మృతదేహాల కోసం ప్రత్యేకంగా రూ. 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక భవంతిని నిర్మించారు. మధ్యతరగతి వారికి, పేదవారికి తక్కువ ధరకు జెనరిక్ మందులు ఇచ్చే ట్రస్టుకి రూ. 2 లక్షలు, విద్యార్థుల పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తకాలు, గోశాల నిర్మాణానికి విరాళం.. ఇలా ఒకటా రెండా ఎన్నో లక్షలను, ఎన్నో సేవలను ఈ సమాజం కోసం అందిస్తున్నారు. వయసులో ఉన్న వాళ్లే ఎవరెలా పోతే నాకేంటి అని స్వార్థంతో ఆలోచిస్తున్న రోజులివి. అలాంటిది పింఛన్ తీసుకునే ఒక పెద్దావిడ.. తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సమాజ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఉంటారా ఎవరైనా ఇలాంటి వారు అంటే దానికి సమాధానమే గుర్రాల సరోజనమ్మ.
నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన గుర్రాల సరోజనమ్మ ఒక రిటైర్డ్ టీచర్. పాతికేళ్ల క్రితమే రిటైర్ అయ్యారు. నెల నెలా వచ్చే పింఛను డబ్బులతో ఇల్లు కొనుక్కున్నారు. దాని విలువ ఇప్పుడు 2 కోట్ల రూపాయలు అయ్యింది. అయినప్పటికీ ఆ ఇంటిని సమాజం కోసం దానం చేశారు. ఈమె భర్త పేరు వెంకట్రావు. నిజాం షుగర్స్ లో ఉద్యోగం చేసేవారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. అయితే పిల్లలు లేరన్న బాధ మాత్రం వెంటాడేది. దీంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలనుకున్నారు. కానీ అవేమీ సాధ్యపడలేదు. తోబుట్టువుల పిల్లల్నే తన పిల్లలుగా భావిస్తే.. వాళ్ళ ప్రేమ ఆస్తి చుట్టూ తిరిగేది. తన మీద ప్రేమ కంటే తన ఆస్తి మీదనే ప్రేమ ఎక్కువైందని బంధాలపై విరక్తి చెందిన ఆమె తన ఆస్తిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నారు.
అయితే ఆ సమయంలో ఉపాధ్యాయులు పడుతున్న బాధలను చూసి ఆమె మనసు చలించిపోయింది. రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సొంత భవనం లేదని తెలుసుకున్న ఆమె.. సంఘానికి ఒక ఇంటిని రాసిస్తే బాగుటుందనిపించి రాసిచ్చేశారు. ఏడాదిన్నర కిందటే తన ఇల్లు సంఘానికి చెందేలా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ ఇంటి విలువ రూ. 2 కోట్లు. ఇల్లు దానం చేయనంతవరకూ వచ్చిన బంధువులు.. సంఘానికి రాసిచ్చిన తర్వాత రావడమే మానేశారు. ఉపాధ్యాయ సంఘాలకు ఇంటిని రాసివ్వడమే కాదు.. చనిపోయిన వారికి గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో రూ. 20 లక్షలు, బతికున్న వారికి ఆరోగ్యం అందించడం కోసం రూ. 2 లక్షలు ఖర్చు పెట్టి సేవలను అందిస్తున్నారు.
ఒకరోజు సరోజనమ్మ దగ్గరి బంధువు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లారు. అయితే ఇంటి యజమాని ఆ శవాన్ని ఇంట్లోకి రానివ్వలేదు. ఇంకో సందర్భంలో పరిచయం ఉన్న ఆవిడ చనిపోతే.. అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు ఇంట్లో కాకుండా దూరంగా చేస్తున్నారు. దీంతో అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఇన్ని బాధలు ఉంటాయా అని అనిపించి.. ఆమె ధర్మస్థల్ ను స్థాపించారు. ఇందులో చనిపోయిన వారి మృతదేహాలను అంత్యక్రియలు జరిగేవరకూ భద్రపరచుకునేలా.. ఫ్రీజర్ సహా అన్ని సదుపాయాలను ఉచితంగా సేవలను అందిస్తున్నారు. ఈ ధర్మస్థల్ ని నిర్మాణం కోసం ఆమె రూ. 20 లక్షలు ఖర్చు పెట్టారు.
అంతేనా.. బతికున్న వారి కోసం ఏమీ చేయకపోతే ఎలా అని.. జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్ మందుల దుకాణానికి తన వంతుగా రూ. 2 లక్షలు విరాళం ఇచ్చారు. లాభం ఆశించకుండా అసలు ధరకే జెనరిక్ మందులను ఈ ట్రస్టు ఇస్తుంటుంది. దీని వల్ల మధ్యతరగతి వారికి, పేదవారికి ప్రయోజనం చేకూరుతుంది. రెంజల్ లోని కందకుర్తి గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికి కూడా ఈమె విరాళం ఇచ్చారు. అంతేకాదు.. ఒక టీచర్ గా యువతను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందంటూ.. యువతకి పోటీ పరీక్షల కోసం అవసరమయ్యే పుస్తకాలను రూ. 20 వేలు ఖర్చు పెట్టి మరీ ప్రభుత్వ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. ఏడాదికొకసారి చింతకుంట వృద్ధాశ్రమానికి వెళ్లి.. అక్కడున్న వృద్దులకు నిత్యావసర సరుకులు, దుస్తులు ఇస్తుంటారు. తనకు కుదిరినప్పుడల్లా అవయవదానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తున్నారు. ఆమె మరణానంతరం తన దేహాన్ని ప్రయోగాలకు ఉపయోగించుకోవాలని ఆమోదపత్రం రాసిచ్చారు.
ఆస్తి సమాజానికి రాసిచ్చిన తర్వాత అయినవాళ్లు దూరమయ్యారు. ఏమీ కానివాళ్ళు ఆప్తులయ్యారని ఆమె చెప్తుంటారు. మొదట్లో తనకెవరూ లేరనుకునే ఆవిడకు.. ఇప్పుడు అందరూ ఆప్తులే. పెద్దమ్మ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. మరి పింఛన్ తీసుకునే వయసులో.. 2 కోట్ల ఇంటిని తన కోసం ఉంచుకోకుండా రాసిచ్చేయడం, రూ. 20 లక్షలు ఖర్చు పెట్టి ధర్మస్థల్ ని నిర్మించడం, జెనరిక్ మందులను ఇచ్చే ట్రస్టుకి రూ. 2 లక్షలు విరాళం ఇవ్వడం, విద్యార్థుల పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాల కోసం రూ. 20 వేలు ఖర్చు పెట్టడం, గోశాలకు విరాళం ఇవ్వడం, ఏడాదికొకసారి వృద్ధాశ్రమానికి వెళ్లి వాళ్లకి నిత్యావసర సరుకులు,దుస్తులు ఇచ్చి రావడం.. ఇన్ని సేవలు అందిస్తున్న ఈ మహాతల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. సమాజం కోసం తన వంతు సాయం అందిస్తున్న గుర్రాల సరోజనమ్మపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.