తెలంగాణలో ప్రశ్నపత్రాల లీక్ కలకలం సృష్టించిన సంగతి అందరికీ విదితమే. డబ్బుతో ఆశతో ఒకరు, కామవాంక్షతో మరొకరు ఈ లీకేజీకి పాల్పడ్డారు. ఈ చిచ్చు నిరుద్యోగులకు తీవ్ర మనోవేదనను మిగుల్చుతోంది. గ్రూప్- 1 ప్రిలిమ్స్ రద్దవడంతో ఇక తనకు ఉద్యోగం రాదేమోనని ఒక నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ఓ నిరుద్యోగి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. గ్రూప్-1 రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించటంతో.. ఇక తనకు ఉద్యోగం రాదేమోనన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. సూసైడ్ నోట్ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా, బివై నగర్ కు చెందిన చిటికెన నాగభూషణం, సుశీల దంపతులకు నలుగురు కుమారులు. వీరందరిలో చిన్నవాడైన నవీన్ కుమార్(30) హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి.. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడటంతో.. వాటికి ప్రిపేర్ అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాయగా.. అందులో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెరమీదకు రావడంతో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన చేసింది. కల నెరవేరుతుందన్న సమయాన ఉన్న ఒక అవకాశం పోవడంతో.. అతడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఇక తనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని తీవ్ర నిరాశకు గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకే పాల్పడ్డాడు.
నవీన్ ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ లెటర్ రాశాడు. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని.. జాబ్ లేకపోవడంతో సంతృప్తికర జీవితాన్ని పొందలేకపోతున్నాని వివరించాడు. “అన్ సాటిస్ఫైడ్ లైఫ్.. నో వన్ ఇస్ రీజన్ ఫర్ దిస్… ఐ యాం యూస్ లెస్ ఫర్ ఆల్ జాబ్ లెస్.. థాంక్యూ టు మై ఫ్యామిలీ… ఐ క్విట్..” అంటూ నవీన్ ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాశాడు. మూడు పదుల వయసులోనే నవీన్ అర్ధంతరంగా తనువు చాలించడం స్థానికులను కంటతడి పెట్టించింది. చెట్టంత ఎదిగిన కొడుకు అకాల మరణం చెందడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు, మున్నీరు అవుతున్నారు. ఈ యువకుడి మరణానికి కారకులెవరో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది ఇలా ఉండగా నవీన్ ఆత్మహత్యకు సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. అసలు నవీన్ గ్రూప్-1 కి అప్లై చేయలేదని.. తెలుస్తోంది. అతడి క్వాలిఫికేషన్, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నవీన్ విద్యార్హత …హోటల్ మేనేజ్ మెంట్ కాగా.. కొన్ని రోజుల క్రితం అతడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో ప్రైవేట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఆ ఇంటర్వ్యూలో నవీన్ విద్యార్హత సరిపోదని బ్యాంకు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అతడు హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో పని చేశాడు. కొంత కాలం సిరిసిల్ల రిలయన్స్ ట్రెండ్స్లో కూడా వర్క్ చేశాడు.
అయితే కరోనాకు ముందు గ్రూప్-2 కోచింగ్ తీసుకున్నాడు. తాజాగా వెలువడిన నోటిఫికేషన్లో గ్రూప్స్కు సంబంధించి దేనికి దరఖాస్తు చేయలేదని సమాచారం. కానీ కొన్ని మీడియా సంస్థలు మాత్రం నవీన్ గ్రూప్-1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాడని.. రాసుకొచ్చాయి. మరి ఈ వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్దమో అర్థం కావడం లేదు. పోలీసుల దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. ఏది ఏమైనా చెట్టంత ఎదిగిన కొడుకు ఇలా అర్ధాంతరంగా కన్ను మూయడం మాత్రం విచారకరం.