తెలంగాణలో వరుసగా అగ్ని ప్రమాద ఘటనలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం అగ్ని ప్రమాద ఘటనలు మరవక ముందే మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం లీ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భయాందోళనలకు గురైన కార్మికులు కంపెనీ నుండి బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకుని కొంత మంది గాయపడ్డారు. ఎగిసి పడుతున్న మంటల ధాటికి కంపెనీ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. ఫార్మా కంపెనీలో భారీగా కెమికల్ నిల్వ చేసి ఉండటంతో అగ్ని ప్రమాద తీవ్రత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
బుధవారం ఉదయం లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు అలముకున్నాయి. అగ్ని ప్రమాదాన్ని గ్రహించిన కార్మికులు బయటకు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో పలువురు కార్మికులు గాయపడగా..వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఒక వైపు మంటలు ఆర్పుతుండగా.. మరో వైపు మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా ఆవహిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.