మల్లం పేట ప్రాంతంలో విద్యుత్ తీగ మెడకు తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఓ జంతువు కూడా షాక్ గురై చనిపోయింది. 30 మంది చిన్నారులతో ఓ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
నిర్లక్ష్యంతో ఎవరో చేసిన తప్పుకు వేరొకరు ప్రాణాలు బలిఅవుతున్నారు. ఈ రోజుల్లో రోడ్డు మీదికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతుంది. మొన్న బండ్లగూడలో ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్లిన ఇద్దు తల్లీకూతుళ్లు, మరో మహిళను రాష్ డ్రైవింగ్ చేస్తూ కారుతో ఢీ కొని .. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ముగ్గురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. అధికారుల నిర్లక్ష్యం వలన వారసిగూడాలో ఓ చిన్నారి మ్యాన్ హోల్ లో పడి కొట్టుకొని పోయి ప్రాణాలు విడిచింది. తాజాగా దుండిగల్ మల్లం పేట ప్రాంతంలో విద్యుత్ తీగ మెడకు తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అదృష్టవశాత్తు స్కూల్ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లంపేట ప్రాంతంలో విషాద సంఘటన జరిగింది. విద్యుత్ తీగ మెడకు చుట్టుకుని ఓ పంది షాక్ గురై చనిపోయింది. నీటి గుంతలో పడి ఉన్న జంతువును చూసి అటుగా వస్తున్న స్కూల్ బస్సు పక్క నుండి వెళ్లిపోయింది. స్కూల్ బస్లో 30 మంది పిల్లలు ఉన్నారు. బస్సు పక్కగా తీసుకెళ్లాడు కాబట్టి నయమయింది. లేకపోతే చాలా విషాదం నెలకొని ఉండేది.
అనంతరం నిమిషాల వ్యవధిలోనే సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి బైక్ పై విద్యుత్ స్థంభం పక్క నుండి వెళ్లాడు అప్పటికే వేలాడి ఉన్న విద్యుత్ తీగ మెడకు తగలడంతో స్పాట్లోనే ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటనలు చూసిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. స్థంభాలకు వేలాడుతున్న విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు వాహనదారులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి సామాన్యుల ప్రాణాలు బలవుతున్నాయి.