కరోనా మహమ్మారి ఇక పోయింది అని అనుకున్న ప్రతిసారి రూపాంతరం చెంది మళ్లీ కొత్త వేరియంట్ గా పుట్టుకొస్తూనే ఉంది. దేశంలో కేసుల నమోదులో స్పల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే మూడో వేవ్ మొదలైపోయింది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 43 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ జరిగింది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా నిర్ధరణ జరిగిన విద్యార్థులను పాఠశాలలో ఐసోలేషన్ లో ఉంచారు. మిగిలిన విద్యార్థులు, ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ పాఠశాలలో మొత్తం 520 మంది విద్యార్థులు ఉన్నారు. నిపుణులు సైతం ఈ సమయంలో తగిన జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. కరోనా ఇంకా అంతం కాలేదని.. నివారణే మనకున్న మార్గమని సూచిస్తున్నారు.