ఐఫోన్ కొనాలి అనేది చాలా మంది కల. ఐఫోన్ డిజైన్, లుక్స్, సెక్యూరిటీ ఫీచర్లు చూసే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ, ఇప్పుడు ఐఫోన్ ని కూడా హ్యాక్ చేసేందుకు వీలుంటుంది అని వస్తున్న వార్తలు యూజర్లను కంగారు పెడుతున్నాయి.
ఐఫోన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్లకు ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. చాలామందికి ఈ ఫోన్ కొనడం అనేది జీవితకాలం కలగా కూడా ఉంది. మార్కెట్లోకి ఏ కొత్త ఐఫోన్ మోడల్ వచ్చినా కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతూ ఉంటాయి. చాలా మందికి ఈ ఐఫోన్ మోడల్స్ కలెక్షన్ కూడా హాబీగా ఉంటుంది. ఎందుకు వాటికి అంత డిమాండ్ అంటే.. వాటి స్టైల్, డిజైన్, ఫీచర్స్ అని చెబుతుంటారు. వాటి కన్నా కూడా సెక్యూరిటీ విషయంలో యూజర్లు ఐఫోన్ ను ఇష్టపడతారు. కానీ, ఇప్పుడు కేంద్రం ఇస్తున్న హెచ్చరికలు చూస్తుంటే ఐఫోన్లు కూడా హ్యాకవుతాయా? అనే ప్రశ్నలు, అనుమానాలు జోరందుకున్నాయి.
ఐఫోన్లు వాటి డిజైన్ తో పాటుగా.. సెక్యూరిటీకి కూడా పెట్టింది పేరు. చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, ప్రముఖులు అంతా ఐఫోన్ ని ఎంచుకోవడానికి కారణం.. వీటిని హ్యాక్ చేయడం దాదాపుగా అసాధ్యమని చెబుతారు. అయితే ఇప్పుడు కేంద్రం ఇస్తున్న హెచ్చరికలు చూస్తుంటే ఐఫోన్ యూజర్లకు కొత్త గుబులు పట్టుకుంది. కొన్ని వర్షన్ ఫోన్లపై హ్యాకర్స్ ప్రభావం ఉంటోందని చెబుతున్నారు. ఆ మోడల్స్, వర్షన్స్ కలిగిన ఐఫోన్ల నుంచి వారి వ్యక్తిగతం సమాచారం చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా హెచ్చరిస్తున్నారు. ఇండియన్ కంప్యూటర్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సంస్థ భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖకు ఓ నివేదికను సమర్పించింది. ఐఓఎస్ లో హ్యాకింగ్ కు చాలా వరకు ఆస్కారం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత, సున్నతమైన సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని చెప్పింది. సాధారణంగా ఐఫోన్లకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్స్, అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. ఈ అప్ డేట్ల కారణంగా మీ ఐఫోన్ ఎంతో సురక్షితంగా ఉంటుంది. కానీ, చాలా మంది ఈ అప్ డేట్స్ చేసుకునేందుకు ముందుంటారు.
కొందరు మాత్రం అప్ డేట్స్ చేసుకోకుండా వదిలేస్తుంటారు. ముఖ్యంగా 16.3.1 వర్షన్, అంతకన్నా ముందు వర్షన్ ఐ ఫోన్లు, ఐపాడ్ ప్రో అన్ని మోడల్స్, థర్డ్ జనరేషన్ ఐపాడ్ ఎయిర్, దాని తర్వాత మోడల్స్, ఐపాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్, ఐఫోన్ 8, ఇలా కొన్ని మోడల్స్ పై హ్యాకర్స్ ప్రభావం ఉన్నట్లుగా హెచ్చరిస్తున్నారు. అందరూ తప్పకుండా లేటెస్ట్ వర్షన్ కు అప్ డేట్ చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. శాంసంగ్ గ్యాలెక్సీ వినియోగదారులను సైతం కేంద్రం హెచ్చరిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ స్టోర్ యాప్ లోనే హ్యాకింగ్ ఆస్కారాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. 4.5.49.8కి మునపటి వర్షన్స్ కలిగిన శాంసంగ్ గెలాక్సీ యాప్ స్టోర్ కలిగిన ఫోన్లపై ప్రభావం ఉంటుందని తెలిపింది.