ఓవల్ వేదికగా టీమిండియా విజయం అంత చిన్నదేం కాదు. రికార్డులు మోత మోగించారు. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది విదేశీ గడ్డపై రోహిత్ శర్మ తొలి శతకం. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 11 పరుగులకే ఔట్ అయి నిరాశ పరిచిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం బ్యాట్ ఝలిపించాడు. 256 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో విదేశీ గడ్డపై తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. టీమిండియా ఆధిపత్యంలో రోహిత్ పరుగులు చాలా కీలకం. రోహిత్ అద్భుత బ్యాటింగ్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
కానీ, క్రికెట్ అభిమానులు, నిపుణులు, అంతెందుకు చివరికి రోహిత్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావాల్సింది తాను కాదని చెప్పుకొచ్చాడు. అందరూ విఫలమవుతున్న సందర్భంగా తన అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్తో శార్దూల్ ఠాకూర్ అందరి చూపును ఆకర్షించాడు. నాలుగో టెస్టులో రెండు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలు చేయడం, మూడు కీలక వికెట్లు తీయడమే అందరూ ఈ అభిప్రాయానికి రావడానికి కారణం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ ‘శార్దూల్ ఠాకూర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావాల్సింది. తాను చేసిన రెండు హాఫ్ సెంచరీలు చాలా ప్రత్యేకం. సరైన సమయంలో వికెట్లు తీసి ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు’ అంటూ రోహిత్ శర్మ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. పేరుకు ఓవల్లో ‘రోహిత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అయినా.. అభిమానులు, రోహిత్, టీమిండియా దృష్టిలో మాత్రం ‘శార్దూల్ ఠాకూరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.