రెండు దేశాల మధ్య మ్యాచ్.. 22 మంది ఆటగాళ్ల మధ్య పోరాటం.. బంతితో బౌలర్లు చేసే విన్యాసాలు.. బ్యాట్ తో బౌండరీలు బాదే బ్యాటర్లు.. ఇదంతా చూసి గ్యాలరీలోంచి అరిచే ప్రేక్షకులు. ఇక కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు పై చేయి సాధిస్తే, మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు పై చేయి సాధిస్తారు. ఇలాంటి క్రికెట్ లో జట్టు విజయాలు సాధించాలి అంటే.. అన్నివిభాగాల్లో పటిష్టంగా ఉండాలి. ముఖ్యంగా టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించేది బౌలింగ్ దళం అనే చెప్పాలి. ఇక గత కొంత కాలంగా టీమిండియా బౌలింగ్ దళం పూర్తిగా విఫలం అవుతూ వస్తుంది అన్న విమర్శల నేపథ్యంలో.. 2022లో భారత జట్టులో బెస్ట్ బౌలర్ ఎవరు? అనే ప్రశ్న అభిమానుల్లో ఉంది. బూమ్రా, చాహల్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, అశ్విన్, అర్షదీప్, అక్షర్ పటేల్ మరికొంత మంది బౌలర్లలో ఎవరు అత్యుత్తమ బౌలరో ఇప్పుడు చూద్దాం.
జస్ప్రీత్ బుమ్రా
2022లో ఎక్కువ గాయాల పాలైన ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అంటే సగటు క్రికెట్ అభిమానులు వెంటనే చెప్పే పేరు బుమ్రా. IPL స్పెషలిస్టుగా పేరుగాంచిన బూమ్రా.. టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నముకగా నిలిచాడు. తరచుగా గాయాల బారిన పడుతున్న బుమ్రాపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. విశ్రాంతి లేకుండా ఐపీఎల్ ఆడటం వల్లే ఇలా గాయాల బారిన పడుతున్నాడని దేశం మెుత్తం విమర్శించింది. ఇక ఈ సంత్సరంలో బూమ్రా ఆడిన మ్యాచ్ లు తక్కువనే చెప్పుకొవాలి. ఈ ఏడాది మెుత్తం 20 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 39 వికెట్లు పడగొట్టాడు. కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడిన బూమ్రా 13వికెట్లు నేల కూల్చాడు. తక్కువ మ్యాచ్ లే ఆడినప్పటికీ అతడి బౌలింగ్ సగటు 22.74గా అద్భుతంగా ఉంది.
భువనేశ్వర్ కుమార్
జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో.. టీమిండియా బౌలింగ్ దళానికి నాయకత్వం వహించాడు భువనేశ్వర్ కుమార్. డెత్ బౌలర్ గా బుమ్రాతో పాటు టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. కానీ మెున్న జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో పేలవమైన బౌలింగ్ తో భారత్ పరాజయాలకు కారణం అయ్యాడు. అయితే భువీ అనుభవంతో కుర్రాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దాడనే చెప్పాలి. ముఖ్యంగా భువీ కోచింగ్ లో యువ సంచలనం అర్షదీప్ చెలరేగాడనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే భువీ అనుభవం ఈ ఏడాది టీమిండియాకు ఒక్క మెగా టోర్నీని కూడా తెచ్చిపెట్టలేదు. ఇక ఈ ఏడాది మెుత్తం 32 మ్యాచ్ లు ఆడిన భువీ 22.63 బౌలింగ్ సగటుతో 36 వికెట్లు నేలకూల్చాడు. కెరీర్ లోనే అత్యుత్తమైన 5/4 బౌలింగ్ గణంకాలను ఆఫ్ఘనిస్తాన్ పై నమోదు చేశాడు భువి.
యజ్వేంద్ర చాహల్
బక్కపలచని శరీరం.. అతడి కంటే బాలే బరువుంటుందేమో అన్న సందేహం కూడా అప్పడప్పుడు కలుగుతుంది. కానీ ఆ బంతితో అతడు చేసే విన్యాసాలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. టీమిండియాలో గతకొంత కాలంగా చోటు అద్భుత ప్రదర్శన చేస్తున్న బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చాహల్ అనే చెప్పాలి. 2022లో మెుత్తం 32 మ్యాచ్ లు ఆడిన చాహల్ 25.11 సగటుతో 44 వికెట్లు తీశాడు. ఈ ఏడాదిలో 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి అత్యుత్తం గణంకాలు నమోదు చేశాడు. ఇక వన్డేల్లో కేవలం 12 మ్యాచ్ లు మాత్రమే ఆడి 21 వికెట్లను నేలకూల్చాడు. టీ20ల్లో 23 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక్కడ విశేషం ఏంటి అంటే.. చాహల్ ఈ ఏడాది ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడలేదు. టెస్టులు ఆడకపోయినప్పటికీ టీమిండియా తరపున ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన ఇండియాన్ బౌలర్ గా నిలిచాడు.
మహమ్మద్ సిరాజ్
గత కొంత కాలంగా టీమిండియాలొ తరచుగా వినిపిస్తున్న పేరు మహమ్మద్ సిరాజ్. కచ్చితమైన వేగంతో బంతులు సంధిస్తూ.. ప్రత్యర్థి ఆటగాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన పదునైన పేస్ తో విజృంభించాడు. సిరాజ్ స్పీడ్ కు ఆసిస్ బ్యాటర్లు వణికిపోయారు. అయితే స్పీడ్ ఉన్నప్పటికీ తరచుగా ఫామ్ కోల్పోవడంతో.. సిరాజ్ కు అవకాశాలు తక్కువగా వచ్చాయి. ఈ క్రమంలోనే 2022లో మెుత్తం 27 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సిరాజ్ 25.97 బౌలింగ్ యావరేజ్ తో 41 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 17 పరుగులకే 4 వికెట్లు నేలకూల్చాడు. ఈ ఏడాది 15 వన్డేలు ఆడిన ఈ హైద్రాబాది స్పీడ్ స్టర్ 24 వికెట్లను పడగొట్టాడు. ఇక టెస్టుల్లో అడపాదడపా అవకాశాలు వచ్చాయి. టెస్టుల్లో తక్కువ అవకాశాలు రావడంతో కేవలం 15 వికెట్లు మాత్రమే తీశాడు సిరాజ్. ప్రస్తుతం బంగ్లాతో టెస్ట్ సిరీస్ తో అద్భుతంగా రాణించాడు.
రవిచంద్రన్ అశ్విన్
టీమిండియాలోకి యువ బౌలర్లు రావడంతో కొంతమేర అశ్విన్ కు అవకాశాలు తగ్గిపోయాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఈ ఏడాది బ్యాటర్లపై పెద్దగా ప్రభావం చూపలేక పోయడు. టెస్టుల్లో అగ్రెసివ్ బౌలింగ్ గణంకాలు ఉన్న అశ్విన్ కు.. వికెట్లు మాత్రం ఎక్కువగా లేవు. 2022లో యువ స్పిన్నర్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంతో అశ్విన్ కు.. ఎక్కువగా మ్యాచ్ లు ఆడే అవకాశం రాలేదు. కొన్ని మ్యాచ్ ల్లో ఆడినప్పటికీ వికెట్లు నేలకూల్చడంలో విఫలం అయ్యాడు. ఈ ఏడాది మెుత్తంలో కేవలం 28 అంతర్జాతీయ మ్యాచ్ లు మాత్రమే ఆడిన అశ్విన్.. 32 వికెట్స్ మాత్రమే పడగొట్టాడు. ప్రస్తుతం బంగ్లాతో సిరీస్ లో రెండు టెస్టుల్లో 8 వికెట్లు పడగొట్టడమే కాకుండా.. బ్యాట్ తో రాణించి టీమిండియా చిరస్మరణియమైన విజయాన్ని అందించాడు.
ఇక మిగిలిన బౌలర్లు అయిన అక్షర్ పటేల్.. 23.85 యావరేజ్ తో 35 మ్యాచ్ ల్లో 42 వికెట్లు తీశాడు. ఇటు బౌలింగ్ తో పాటుగా కొన్ని కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటింగ్ లో సైతం మెరిశాడు అక్షర్ పటేల్. ఇక టీమిండియా నయా సంచలనం అర్షదీప్ సింగ్ 2022లో అద్భుతంగా రాణించాడు. ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అత్యధిక వికెట్లు తీసి స్టార్ బౌలర్ గా ఎదిగాడు. ఇక ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన చాహల్ కంటే తక్కువ బౌలింగ్ యావరేజ్ ను నమోదు చేశాడు అర్షదీప్ సింగ్. ఈ ఏడాది కేవలం 21.35 సగటుతో 22 మ్యాచ్ ల్లోనే 34 వికెట్లు సాధించాడు. ఈ సంవత్సరం అద్భుత ప్రదర్శన చేసిన వరల్డ్ క్లాస్ బౌలర్లలో కచ్చితంగా అర్షదీప్ ఉంటాడు. ఇక 2022లో టీమిండియా బెస్ట్ బౌలర్ ఎవరు అన్న విషయంలో క్రీడా విశ్లేషకులు యజ్వేంద్ర చాహల్ అని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ గా చాహల్ నిలిచాడు. అతడి తర్వాత యంగ్ ప్లేయర్ అక్షర్ పటేల్ నిలవడం విశేషం.