భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని వదులకున్నప్పుడే అంతా అయిపోయిందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అంటున్నాడు.
ఏ ఆటలోనైనా గెలుపోటములు సర్వసాధారణం. జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మిగతా ఆటల్లాగే క్రికెట్లో కూడా ఒక్కోసారి అనూహ్య ఓటములు ఎదురవుతుంటాయి. అయితే ఓటముల నుంచి ఎంత త్వరగా బయటపడి, తిరిగి గెలుపు బాట పడతామనేది ముఖ్యం. కానీ తాము ఎంతగానో ఆరాధించే ప్లేయర్లు విఫలమైనప్పుడు, జట్లు ఓడిపోయినప్పుడు అభిమానులు దాన్ని అంత సులువుగా జీర్ణించుకోలేరు. ఇప్పుడు భారత క్రికెట్ జట్టు పరిస్థితి కూడా అలాగే ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చూసి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. టెస్టుల్లో వరల్డ్ కప్గా భావించే డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత జట్టు ప్రిపరేషన్స్, ప్రాక్టీస్ తగిన స్థాయిలో లేవని అభిమానులు అంటున్నారు.
ఇంత పెద్ద మ్యాచ్ పెట్టుకొని భారత ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతూ నిర్లక్ష్యంగా ప్రవర్తించారని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. టెస్ట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ పైనా ట్రోలింగ్ చేస్తున్నారు. రోహిత్ టెస్ట్ కెప్టెన్సీకి పనికిరాడని.. అతడి ప్లేసులో మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు సారథిగా ఉన్న విరాట్ కోహ్లీనే హిట్మ్యాన్ కంటే బెస్ట్ కెప్టెన్ అని అంటున్నారు. ఈ టైమ్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ ఒక అద్భుతమైన ఫార్మాట్ అని చెప్పిన మోర్గాన్.. ప్రస్తుత పరిస్థితులు మాత్రం లాంగ్ ఫార్మాట్కు సవాల్ విసురుతున్నాయని తెలిపాడు. కోహ్లీ లాంటి గొప్ప కెప్టెన్ను టెస్ట్ క్రికెట్ మిస్సవుతోందన్నాడు. అతడు కెప్టెన్సీ వదిలేసినప్పుడే అంతా అయిపోయిందన్నాడు. టెస్ట్ క్రికెట్ను ఎంతగానో ప్రేమించే కోహ్లీ సారథ్యాన్ని అందరూ మిస్సవుతున్నారని మోర్గాన్ పేర్కొన్నాడు.
Eoin Morgan on Virat Kohli pic.twitter.com/xNxJAWeX9Y
— RVCJ Media (@RVCJ_FB) June 14, 2023