జపాన్ రాజధాని టోక్యోలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఓవైపు ఒలింపిక్స్ జోరుగా సాగుతుండగా, కరోనా చాపకింద నీరులా చుట్టుముడుతోంది. నిన్న ఒక్క రోజులోనే ఏకంగా 4,058 కేసులు వెలుగు చూశాయని టోక్యో మెట్రో పాలిటన్ గవర్నమెంట్ తెలిపింది. ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్ లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 193కి చేరగా, వైరస్ బారిన పడిన అథ్లెట్ల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది.
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న 29 మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన అథ్లెట్లు, క్రీడా సహాయ సిబ్బందిని క్రీడా గ్రామం నుంచి బయటకు తీసుకువచ్చి క్వారంటైన్ చేశారు. జపాన్ దేశంలో డెల్టా వేరియంట్ వైరస్ ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులుంటేనే ప్రయాణించాలని లేకుంటే ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని జపాన్ సర్కారు సూచించింది.
కరోనా కట్టడి కోసం జపాన్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. రాత్రి 8 గంటలకే ఆఫీసులను మూసివేసి, ఉద్యోగులు నేరుగా ఇళ్లకు వెళ్లాలని జపాన్ ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. అలాగే ఒలింపిక్లో గోల్ఫ్ టోర్నీపై కూడా కరోనా ప్రభావం పడింది. కసుమిసజెకి కౌంటీ క్లబ్లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడడంతో టాప్ ప్లేయర్లు, ఒలింపిక్స్కి దూరంగా ఉన్నారు.
రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కెండ్రిక్స్, కరోనా బారిన పడడంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. అయితే అతనితో కాంటాక్ట్ ఉన్న ఆస్ట్రేలియా అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్కి వెళ్లాల్సి వచ్చింది. యూఎస్ పోల్ వాల్టర్ సామ్ కెండ్రిక్స్కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్కి వెళ్లింది.