గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతే.. ఎవరికైనా బాధగానే ఉంటుంది. మరి బాధలో ఉన్నప్పుడు పుండు మీద కారం చల్లినట్లు ప్రశ్నలు వేస్తే.. చిర్రెత్తుకొస్తుంది. అలాగే చిర్రెత్తుకొచ్చింది బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాతో మ్యాచ్ ఓడిపోయిన అనంతరం విలేకర్ల సమావేశానికి హాజరైన షకీబ్.. జర్నలిస్టులపై మాటలతో యుద్ధానికి దిగాడు. వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారిపై అసహనం వ్యక్తం చేశాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా.. ఓడిపోయిన బాధను రిపోర్టర్ల మీద వెళ్లగక్కాడు షకీబ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
భారత్- బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ని వివాదాలు చుట్టు ముట్టాయి. ఓ వైపు వర్షం రావడం, కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్, అంపైర్లు విరాట్ చెప్పినట్లే వినడం లాంటి పాయింట్లపై అటు బంగ్లా ఫ్యాన్స్.. ఇటు పాక్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గొడవ చేయడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా షకీబ్ రిపోర్టర్లతో గొడవకు దిగిన సంఘటన వెలుగు చూసింది. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో పాల్గొన్న షకీబ్ వారి ప్రశ్నలకు కోపంగా సమాధానం ఇచ్చాడు. “మీరు వర్షం పడ్డ తర్వాత మ్యాచ్ ను కొనసాగించాలని అనుకోలేదు కదా? బ్యాడ్ లక్ షకీబ్. మీరు అంపైర్లతో ఏం మాట్లాడారు” అని రిపోర్టర్ ప్రశ్నించాడు.
దానికి షకీబ్ సమాధానం ఇస్తూ.. “మ్యాచ్ ఆడకుండా మీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా?” అంటూ వ్యంగ్యంగా ఆన్సర్ ఇచ్చాడు. “నో మా దగ్గర ఏ ఆప్షన్ లేదు. మీరు అంపైర్ ను, రోహిత్ ను కన్విన్స్ చేయాలని చూశారా?” అని ప్రశ్నించగా, “నాకు అంపైర్ ను కన్విన్స్ చేసే సామర్థ్యం ఉందని మీరు నమ్ముతున్నారా?” అని తిరిగి ప్రశ్నించాడు షకీబ్.”మరి మీరు వారితో బంగ్లాదేశ్ లో ఉన్న నదుల గురించి మాట్లాడారా? మీ ఇద్దరిని పిలిచి వారు ఏం మాట్లాడారు” అని వ్యంగ్యంగా రిపోర్టర్ మరో ప్రశ్న సంధించాడు. “ఇప్పుడు మీరు సరైన క్వశ్చన్ అడిగారు. మా ఇద్దర్ని పిలిచి వర్షం తర్వాత ఆట నియమ నిబంధనల గురించి చెప్పాడు” అని తీరిగ్గా బదులిచ్చాడు. మరి మీరు వాటికి ఒప్పుకున్నారా అని అడగ్గా.. అవును అంటూ షకీబ్ సమాధానం ఇచ్చాడు. తర్వాత రిపోర్టర్ థ్యాక్యూ చెప్పి ప్రెస్ మీట్ ముగించారు.