పీవీ సింధు.. బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచడంలో ఆమె కృషి ఎంతో ఉంది. ఒలింపిక్స్ లో పతకాలు సాధించడమే కాకుండా.. ఇటీవల కామన్వెల్త్ లో క్రీడల్లో తొలిసారి గోల్డ్ సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తున్న సింధు ఆలీతో సరదాగాలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటకు వచ్చేయడంపై కూడా సింధు స్పందించింది.
“అమ్మానాన్నలను చూసి స్పోర్ట్స్ పర్సన్ కావాలని కోరుకున్నా. కానీ, నా ఇష్ట ప్రకారమే బ్యాడ్మింటన్ ఆటను ఎంచుకున్నాను. మహబూబ్ అలీ నాకు బ్యాడ్మింటన్ లో ఓనమాలు నేర్పించారు. ఆ తర్వాత ఆరిఫ్, గోవర్థన్, గోపీగారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ప్రతి ఒక్క కోచ్ దగ్గర నేర్చుకునేందుక చాలా విషయాలు ఉంటాయి. అయితే చాలా ఏళ్లు గోపీచంద్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాను.”
“ఇండోనేషియా, కొరియాకు చెందిన కోచ్ ల వద్ద కూడా ఎంతో నేర్చుకున్నాను. ప్రతి ప్రత్యర్థికి ఎంతో టఫ్ కాంపిటీషన్ ఇస్తాను. ప్రతి మ్యాచ్ లో నూటికి నూరు శాతం ఎఫర్ట్ పెడతాను. పోడియంపై నిల్చుని జాతీయ జెండాను చూస్తూ.. జాతీయ గీతం వింటున్న సమయంలో మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది. గేమ్స్ అన్నాక గాయాలు సర్వసాధారణం. ప్రతి ఆటగాడు ఏదోక సమయంలో ఆ పెయిన్ ను అనుభవించే ఉంటాడు.” అంటూ చెప్పుకొచ్చింది.
“2015వ సంవత్సరంలో నేను నొప్పితోనే 6 నెలలు ఆట కొనసాగించాను. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఒలింపిక్స్ లో పోటీ పడాలంటే టాప్-16లో నిలవాలి. అందుకోసం విశ్రాంతి తీసుకుని 23 టోర్నమెంట్లు ఆడి ర్యాంకును మెరుగు పరుచుకున్నాను. అయితే ఆడిన తొలి ఒలింపిక్స్ లోనే పతకం నెగ్గడం సంతోషంగా అనిపించింది. దేశం కోసం ఇంకా చాలా గెలవాలని అనుకుంటూనే ఉంటాను.”
గోపీచంద్ అకాడమీని వీడటంపై కూడా పీవీ సింధు క్లారిటీ ఇచ్చింది. “అక్కడ చాలా ఏళ్లు ఆడాను. ఆ అకాడమీలో జరిగే కొన్ని విషయాలు నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు. ఎందుకో అవి నాకు సెట్ కావని అనిపించింది. ఒలింపిక్స్ వంటి మెగా టోర్నీ ముందు ఏకాగ్రత చాలా అవసరమని అకాడమీ నుంచి బయటకు వచ్చేశాను. నేను ఆ అకాడమీలో ఉన్న సమయంలోనూ వేరు వేరు కోచ్ ల వద్ద శిక్షణ తీసుకున్నాను. నేను ఎప్పుడూ పాజిటివ్ గానే ఉండాలని అనుకుంటూ ఉంటాను. అందుకే అకాడమీ నుంచి బయటకు వచ్చేశాను.” అంటూ పీవీ సింధు వ్యాఖ్యానించింది.