క్రికెట్లో చిత్రవిచిత్రమైన మిస్ ఫీల్డింగ్ విన్యాసాలకు, ఊహకందని రీతిలో రివ్యూలు తీసుకోవడంలో పాకిస్థాన్ స్టైలే వేరు. వారికి మాత్రమే సాధ్యమైన ఈ టాలెంట్తో మరోసారి నవ్వుల పాలయ్యారు. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు ధైర్యం చేసి.. పాక్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ తొలి టెస్టులో అద్భుతమైన ఆటతో విజయం సాధించింది. హిస్టారిక్ టెస్టులో పాక్ ఓడిపోయింది. మూడు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్ 1-0తో లీడ్ సాధించింది. శుక్రవారం ముల్తాన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభమైంది. అయితే.. ఈ టెస్టులో ఇంగ్లండ్ అగ్రెసివ్ గేమ్కు పాక్ కొత్త బౌలర్ అబ్రార్ అహ్మద్ అడ్డుకట్ట వేశాడు. మిస్టరీ స్పిన్తో ఇంగ్లండ్ బౌలింగ్ను కుప్పకూల్చాడు. ఈ టెస్టుతోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అబ్రార్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సంచలనం నమోదు చేశాడు.
కాగా.. ఈ మ్యాచ్లో వరుస విరామాల్లో పాక్ బౌలర్ అబ్రార్ వికెట్లు తీస్తూ.. ఇంగ్లండ్పై పైచేయి సాధిస్తున్నా.. పాక్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్, పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ మాత్రం తమ వెర్రీ తననాన్ని బయటపెట్టుకున్నారు. అప్పటికే ఐదు వికెట్లు తీసి మంచి జోరు మీదున్న అబ్రార్.. వేసిన ఇన్నింగ్స్ 41వ ఓవర్లో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ ఐదో బంతి ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్యాడ్స్కు తాకింది. దీంతో వెంటనే పాక్ ఆటగాళ్లు అవుట్ కోసం అప్పీల్ చేశారు. కానీ.. వికెట్ లైన్ దాటి లెగ్ స్టంప్ను బాల్ మిస్ చేస్తుండటంతో అంపైర్ దాన్ని నాటౌట్గా ప్రకటించాడు. అయినా కూడా.. పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ ప్రోద్బలంతో పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ రివ్యూకు వెళ్లాడు. పాక్ కెప్టెన్ బాబర్ రివ్యూ కోరిన వెంటనే ఫీల్డ్ అంపైర్ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.
పిచ్పై వికెట్ లైన్ను, అలాగే లెగ్ స్టంప్ను మిస్ చేస్తున్నట్లు చాలా క్లియర్గా తెలుస్తోంది. అయినా కూడా పాక్ రివ్యూ కోరడంపై క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక రివ్యూలో చూస్తే.. బాల్ పిచ్ అయిన ప్లేస్ ఎక్కడో ఉండటంతో థర్డ్ అంపైర్కు ఆలస్యం చేయకుండా.. దాన్ని నాటౌట్గా ప్రకటించాడు. దీంతో పాక్ ఆటగాళ్లు తమ తప్పు తెలుసుకుని నోళ్లు వెళ్లబెట్టారు. కాగా.. సోషల్ మీడియాలో పాక్ కోరిన రివ్యూపై సెటైర్ల వర్షం కురుస్తోంది. ఇలాంటి రివ్యూలు పాకిస్థాన్ తప్పితే.. ప్రపంచంలో ఏ జట్టు కూడా కోరదంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా.. రెండో టెస్టు తొలి రోజు పాకిస్థాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ను 281 పరుగులకే పాకిస్థాన్ బౌలర్లు ఆలౌట్ చేశారు. అరంగేట్రం బౌలర్ అబ్రార్ అహ్మెద్ 7, జాహిద్ మహమూద్ 3 వికెట్లు తీసుకున్నారు. ఇక సాయంత్రం టీ బ్రేక్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. 28 ఓవర్లలో 107 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి తొలి రోజు ఆటను ముగించింది. ప్రస్తుతం పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ 61 పరుగులతో, షకీల్ 32 పరుగులతో నాటౌట్గా ఉన్నారు.