ఐపీఎల్ 2022 కంటే ముందు చెత్త ఫామ్, గాయాల బెడదతో టీమిండియాలో చోటు కోల్పోయిన ఆటగాడు హార్థిక్ పాండ్యా. అలాంటి స్థితి నుంచి గోడకు కొట్టిన బంతిలా ఐపీఎల్ అదరగొట్టి తన సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ను ఐపీఎల్ విజేతగా నిలబెట్టాడు. ఆ వెంటనే టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో మంచి ప్రదర్శన కనబర్చడంతో ఏకంగా ఐర్లాండ్తో సిరీస్ కోసం టీమిండియా కెప్టెన్గా ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్లో విజయంతో తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని విజయంతో ప్రారంభించాడు.
అలాగే ఒక అరుదైన రికార్డుతో టీమిండియాలోని హేమాహేమీలుగా ఉన్న ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. టీ20 క్రికెట్లో భారత తరపున అత్యధిక స్ట్రైక్ రేట్ ఉన్న బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు 40 టీ20 ఇన్నింగ్స్లు ఆడిన పాండ్యా 147.57 స్ట్రైక్రేట్తో 670 పరుగులు చేశాడు. అతని తర్వాత కేఎల్ రాహుల్ 142.49 స్ట్రైక్రేట్తో రెండో స్థానంలో ఉన్నాడు.
రోహిత్ శర్మ 139.55 స్ట్రైక్రేట్తో మూడో స్థానంలో, శ్రేయస్ అయ్యర్ 139.35 స్ట్రైక్రేట్తో నాలుగో ప్లేస్లో, విరాట్ కోహ్లీ 137.67 స్ట్రైక్రేట్తో ఐదో స్థానంలో ఉన్నారు. కాగా టీ20ల్లో కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా ఆధారంగా ఈ స్థానాలు కేటాయించారు. పరుగుల పరంగా చూస్తే.. టీ20ల్లో 3313 పరుగులతో రోహిత్ శర్మ టాప్లో ఉంటే, 3296 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో పోటాపోటీగా ఉన్నారు. మరి ఈ రికార్డు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.