9 జట్లు, రెండు సంవత్సరాల కష్టం. కోట్ల మంది క్రికెట్ ప్రేమికుల ఎదురుచూపులు ఇవన్నీ వర్షార్పణం అయిపోయాయి. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ తొలి ఫైనల్ లో ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదు. తొలిరోజు నుండి ఈ టెస్ట్ ని వర్షం వెంటాడుతూనే ఉంది. వర్షం కారణంగా తొలిరోజు ఆట సాధ్యపడలేదు. రెండో రోజు వెలుతురు లేమి కారణంగా కొన్ని ఓవర్స్ మాత్రమే పడ్డాయి. మూడో రోజు కాస్త పర్వాలేదు. ఇక అంతా ఓకే అనుకుంటున్న సమయంలో నాలుగో రోజు ఆట మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఇక రిజర్వ్ డే ని కలుపుకుని చూసినా.. రెండు రోజుల్లో ఈ టెస్ట్ లో ఫలితం రావడం అసాధ్యం. నిజానికి టెస్ట్ క్రికెట్ కి ఆదరణ పెంచడానికి ఐసీసీ చేసిన ఓ గొప్ప ప్రయత్నం టెస్ట్ ఛాంపియన్ షిప్. కానీ.., ప్రతిష్టాత్మక ఈ ఫైనల్ మ్యాచ్ ఇలా చప్పగా మారడానికి కూడా ఐసీసీనే అన్న విమర్శలు ఎక్కువ అయ్యాయి.
వర్షం విషయం కాసేపు పక్కన పెడితే.. ఒకే ఒక్క టెస్ట్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ని తేల్చాలి అనే ఆలోచన ఐసీసీ చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఇలా కాకుండా ఒక మూడు టెస్ట్ లు పెట్టి, ఫైనల్ ని ఒక సిరీస్ లా నిర్వహించి ఉంటే.., ఓ పండగలా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సిరీస్ జరిగి ఉండేది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ల మధ్య జరిగే యాషెస్ టెస్ట్ సీరిస్ కన్నా దీనికి ఎక్కువ రీచ్ వచ్చి ఉండేది. కానీ.., ఈ విషయంలో ఐసీసీ పూర్తిగా విఫలం అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే వర్షం. యూకే లో జూన్ అంతా వర్షాలు పడతాయని అందరికీ తెలుసు. ఈ సీజన్ లో అక్కడి వాతావరణం అస్సలు క్రికెట్ కి సహకరించదు. కానీ.., ఈ విషయంలో ఐసీసీ ఎందుకు ముందుగా ఆలోచన చేయలేకపోయింది? ఇంత పెద్ద సీరీస్ ఫైనల్ కి ఒకే ఒక్క టెస్ట్ ని పెట్టినప్పుడు.. యూకే కాకుండా, యూఏఈలాంటి వేదికను ఎంచుకుని వుంటే బాగుండేది. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్, భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ లాంటి సీనియర్స్ సైతం ఇవే అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం. కానీ.., ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు ఐసీసీ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహణలో ఐసీసీ విఫలమైందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.