భారత క్రికెట్ జట్టుకు సంబంధించిన కోచింగ్ బృందంలో పలు మార్పులు చేర్పులు ఉంటాయని ఇప్పటికే తెలుస్తోంది. రవిశాస్త్రికి 59 ఏళ్లు పూర్తి అయ్యాయి. టీమ్ ఇండియా కోచ్ వయో పరిమితి 60 ఏళ్ల వరకు మాత్రమే. కనుక ద్రవిడ్ ను ఆస్థానంలోకి ఎంపిక చేసేలా చర్యలు జరుగుతున్నాయి. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా జట్టుకు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించాడు. టీమిండియా కొత్త చీఫ్ కోచ్ గా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి వెళ్లిపోతున్నట్లు విశ్వస నీయంగా తెలుస్తోంది. చీఫ్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి రవిశాస్త్రి తెలియజేశాడని సమాచారం. అండర్-19, భారత్-ఏ టీమ్ కోచ్ గా ద్రావిడ్ విజయవంతమయ్యాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ గా రిజర్వ్ బెంచ్ ను పటిష్ఠం చేసిన ఘనత కూడా ఆయన సొంతం.
బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటి వారికి ద్రావిడ్ అత్యంత సన్నిహితుడు. వీరందరూ కలిసి టీమిండియాకు ఎన్నో ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. ఈ రకంగా చూసినా ద్రావిడ్ చీఫ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి.