ధనాధన్ ఆటతో టెస్టులకు కొత్త రూపునిస్తున్న ఇంగ్లండ్.. ఏది ఏమైనా ‘బజ్బాల్’ క్రికెట్ కొనసాగించాలని అనుకుంటోంది.
ఒకప్పుడు ఇంగ్లండ్ జట్టంటే.. కేవలం టెస్టు క్రికెట్లో ప్రధాన పోటీదారుగా కనిపించేంది. 2015 వన్డే ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన అనంతరం జట్టులో సమూల మార్పులు చేసిన ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు.. జిడ్డు ఆటగాళ్లకు స్వస్తి చెప్పి.. బంతిని బలంగా ఆడగలిగే వారికి పెద్ద పీట వేసింది. ఫలితంగా నాలుగేళ్లు తిరిగేసరికి వన్డేల్లో ఇంగ్లిష్ జట్టు బలమైన శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలో అత్యధిక సార్లు 50 ఓవర్లలో 350+ ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి ఆటగాడు దంచుడే పరమావధిగా రెచ్చిపోయే లక్షణాన్ని అలవరుచుకోవడంతో 2019లో ఇంగ్లిష్ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకుంది.
ఇక టెస్టు క్రికెట్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మెక్కల్లమ్.. ఇంగ్లండ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లిష్ ప్లేయర్ల ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ను ఇరు జట్లు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వైరం కోసం ప్లేయర్లు తమ సర్వస్వాన్ని ధారపోసేందుకు సిద్ధంగా ఉంటారు. అలాంటి ప్రముఖమైన సిరీస్లో.. అది కూడా తొలి మ్యాచ్లో తొలి రోజే ఓ జట్టు కెప్టెన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తాడని ఎవరైనా ఊహించగలరా? అది కూడా తమ జట్టులోని ప్రధాన బ్యాటర్ అజేయ సెంచరీతో ఫుల్ జోష్ లో ఉన్నప్పుడు? వేరే ఏ జట్టైనా ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది.. కానీ బెన్ స్టోక్స్ మాత్రం ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి తమ దమ్ముచూపాడు.
ప్రతిష్టాత్మక సిరీస్లో వరుసగా రెండు టెస్టులు కోల్పోయిన అనంతరం కూడా.. ఏమాత్రం వెనక్కి తగ్గని స్టోక్స్.. తమ ఆటతీరులో ఎలాంటి మార్పు ఉండదని. ఇక మిగిలిన మూడు మ్యాచ్లు గెలిచి 3-2తో సిరీస్ కైవసం చేసుకుంటామని ధైర్యంగా చెప్పాడు. వాటిని మైదానంలో దాదాపు నిజం చేసిన ఇంగ్లిష్ జట్టు చివరి మూడు మ్యాచ్ల్లో రెండింట్లో నెగ్గింది. మూడో మ్యాచ్ లో కూడా ఇంగ్లండ్ కు మెరుగైన విజయావకాశాలు ఉన్న సమయంలో మ్యాచ్కు వరుణుడు అడ్డుపడటంతో నాలుగో టెస్టు ‘డ్రా’ అయింది. ఫలితంగా టెస్టు సిరీస్ సమమైనా.. తమ ఆటతీరులో మాత్రం మార్పు ఉండదని స్టోక్స్ పునరుద్ఘాటించాడు. అయితే వచ్చే ఏడాది ఇంగ్లిష్ జట్టు భారత్ లో పర్యటించనుండగా.. టీమిండియాపై బజ్బాల్ ఆటతీరు పనిచేస్తుందా అనే ప్రశ్న స్టోక్స్కు ఎదురైంది.
దీనిపై తనదైన శైలిలో స్పందించిన స్టోక్స్.. ‘న్యూజిలాండ్ను 3-0తో చిత్తు చేశాం. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆస్ట్రేలియాపై అదే కొనసాగించాం. భారత్లో సాధ్యమైతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. మా వరకైతే గెలిచేందుకే ప్రయత్నిస్తాం. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది’ అని పేర్కొన్నాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య వచ్చే ఏడాది 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఇందులో భాగంగా 2024 జనవరి 25 నుంచి 29 వరకు జరుగనున్న తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు రెండో టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే.