గెలుపు కోసం వాడే వ్యూహం ఫలితం ఇస్తుంది కదా అని.. పదే పదే దాన్నే వాడితే అది మూస పద్దతిగా మారిపోతుంది. అప్పటి వరకు గెలిపించిన వ్యూహం తిరగబడి ఓటమికి కారణంగా మారొచ్చు. ఇంగ్లండ్ విషయంలో బెన్ స్టోక్స్ అనుసరిస్తున్న గెలుపు మంత్రమే.. ఇప్పుడు వారి పరువు పోయేందుకు కారణమైంది.
వెల్లింగ్టన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ను న్యూజిలాండ్ ఒక్క పరుగు తేడాతో ఓడించింది. అది కూడా ఫాలో ఆన్ ఆడి మరీ ఈ మ్యాచ్లో కివీస్ విజయం సాధించింది. నిజంగా ఇది గొప్ప విజయం. టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన మూడో జట్టు న్యూజిలాండే. గతంలో ఇంగ్లండ్ రెండు సార్లు, భారత్ ఒక సారి ఫాలో ఆన్ ఆడి గెలిచి చరిత్ర సృష్టించాయి. చివరి సారిగా టీమిండియా 2001లో కోల్కత్తా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఫాలో ఆన్ ఆడి గెలిచింది. మళ్లీ 22 ఏళ్లకు ఓ జట్టు ఫాలో ఆన్ ఆడి టెస్టు మ్యాచ్ గెలిచింది. అందులోనూ.. కేవలం ఒక్క పరుగు తేడాతో టెస్ట్ గెలవడం అంటే అద్భుతమనే చెప్పాలి. ఈ అద్భుత విజయాన్ని సాధించడంలో న్యూజిలాండ్ కష్టం ఎంతుందో, ఇంగ్లండ్ తప్పు కూడా అదే స్థాయిలో ఉంది. ఇలాంటి దారుణ ఓటమిని పొంది, ఇంగ్లండ్ పరువు తీసుకోవడానికి కారణం.. ఆ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వార్థమే కారణమంటూ ఆరోపణలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టెస్టు ఫార్మాట్లో వరుస ఓటములతో ఇంగ్లండ్ సతమతం అవుతున్న నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ జో రూట్.. 2022లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్కు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. టెస్టుల కోసం అంతకుముందే బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్కు గుడ్బై చెప్పాడు. స్టోక్స్తో పాటు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ను టెస్ట్ టీమ్ కోచ్గా నియమించింది. ఇక్కడి నుంచి బెన్ స్టోక్స్-బ్రెండన్ మెక్కల్లమ్ జోడీ నేతృత్వంలో ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ప్రయాణం కొత్తగా ప్రారంభమైంది. మెక్కల్లమ్ కోచ్గా, స్టోక్స్ కెప్టెన్గా టెస్ట్ క్రికెట్లో ఇంగ్లండ్ అగ్రెసివ్ క్రికెట్ ఆడుతుందని ప్రకటించుకున్నారు.
అన్నట్లుగానే 2022లో న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో.. ఇంగ్లండ్ ‘బజ్బాల్’ స్ట్రాటజీతో టెస్ట్ క్రికెట్ ఆడుతుందనే ప్రచారం జరిగింది. సహజంగానే మెక్కల్లమ్ విధ్వంసకర ఆటగాడు. అతని కోచింగ్లో ఇంగ్లండ్ కూడా టెస్ట్లను అగ్రెసివ్గా ఆడుతుందని, అందుకే మెకకల్లమ్ నిక్నేమ్తో ‘బజ్ బాల్’ స్ట్రాటజీ అంటూ ఇంగ్లండ్ అగ్రెసివ్ క్రికెట్కు కొత్త పేరును తగిలించారు. అయితే ‘బజ్ బాల్’ అనే మాటకు అర్థం లేదని, టెస్టు క్రికెట్కు కొత్త కళను తీసుకొచ్చేందుకు, టెస్టులపై తగ్గుతున్న ఆసక్తిని మళ్లీ పెంపొందించేందుకు టెస్టుల్లో వేగంగా ఆడుతూ ఫలితాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నట్లు, ఇలానే ఆడి టెస్టు క్రికెట్కు కొత్త అర్థం చెప్తామంటూ ఇంగ్లండ్ కోచ్, కెప్టెన్లు పలు సందర్భాల్లో ప్రకటించారు.
చెప్పినట్లు గానే న్యూజిలాండ్ను మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్ చేసిన తర్వాత.. ఇండియాతో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టులోనూ ఇంగ్లండ్ విజయకేతనం ఎగురవేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్ను 2-1తో గెలిచింది. ఆ తర్వాత పాకిస్థాన్ను వారి దేశంలోనే మూడు టెస్టుల సిరీస్లో వైట్వాష్ చేసింది. తాజాగా రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్.. తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఇంగ్లండ్ 11 టెస్టులు ఆడితే అందులో 10 విజయాలు సాధించడంతో స్టోక్స్ అనుసరిస్తున్న ‘అగ్రెసివ్’ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేస్తోందని ప్రపంచమంతా నమ్మింది.
2020లో రూట్ గైర్హాజరీతో వెస్టిండీస్తో ఒక టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్గా స్టోక్స్ వ్యవహరించాడు. ఆ టెస్టులో ఇంగ్లండ్ ఓడిపోయింది. కానీ.. పూర్తి స్థాయి కెప్టెన్గా, మెక్కల్లమ్ కోచ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్టోక్స్ కెప్టెన్గా అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. వరుస విజయాలతో తాను వెళ్లేదారి సరైందని బలంగా నమ్మాడు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ స్టోక్స్ అదే అగ్రెసివ్ ఇంటెంట్ను చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో 435 పరుగుల వద్ద స్టోక్స్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. అప్పటికి 8 వికెట్లు నష్టపోగా, చేతిలో ఇంకా రెండు వికెట్లు ఉన్నాయి. పైగా జో రూట్ 153 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. మ్యాచ్లో ఇంగ్లండ్దే ఫస్ట్ బ్యాటింగ్. ఇంకొన్ని ఓవర్లు బ్యాటింగ్ కొనసాగించినా నష్టమేమి లేదు. అయినా కూడా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించిన స్టోక్స్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ 209 పరుగులకే ఆలౌట్ కాగా.. కేవలం 226 పరుగుల లీడ్ను చూసుకుని కివీస్ను ఫాలో ఆన్ ఆడించాడు స్టోక్స్.
పోరాటానికి ప్రతిరూపంగా నిలిచే న్యూజిలాండ్.. అద్భుతంగా పోరాడి, ఫాలో ఆన్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లుకు చుక్కలు చూపించింది. టాప్ క్లాస్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తూ.. సెంచరీతో చెలరేగి.. కివీస్కు రెండో ఇన్నింగ్స్లో 483 పరుగుల భారీ స్కోర్ అందించాడు. దీంతో.. ఇంగ్లండ్ ముందు 257 పరుగుల లక్ష్యం వచ్చిపడింది. న్యూజిలాండ్ ఇచ్చిన ఊహించని షాక్తో లక్ష్యఛేదను ఆరంభించింది ఇంగ్లండ్. ఫాలో ఆన్ ఇన్నింగ్స్లో తమ బ్యాటర్లు చూపించిన పోరాటంతో స్ఫూర్తి పొంది, గెలవాలనే కసి పెంచుకున్న కివీస్ బౌలర్లు.. ఇంగ్లండ్ బ్యాటర్లను వణికించారు.
తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన యువ క్రికెటర్ హ్యారీ బ్రూక్ను డకౌట్ చేయడంతో పాటు జో రూట్ను మినహాయించి ఎవర్నీ కూడా ఎక్కువసేపు క్రీజ్లో ఉంచలేదు. చివరికి ఇంగ్లండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన దశలో కూడా పట్టువదలకుండా.. 5 పరుగుల వ్యవధిలో చివరి రెండు వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ ఒక్క పరుగుతో గెలిచి చరిత్ర సృష్టించింది. ఫాలో ఆన్ ఆడించి మరీ ఓటమి పొందిన జట్టుగా ఇంగ్లండ్ ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. అయితే.. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 438 వద్ద డిక్లేర్ చేయకుండా చేతిలో ఉన్న రెండు వికెట్లతో మరో 10 పరుగులు చేసినా.. ఈ విజయం వారిదే. కానీ.. స్టోక్స్ చూపించిన అత్యుత్సాహం, తన కెప్టెన్సీలో వరుస విజయాలు దక్కాలనే స్వార్థమే ఇంగ్లండ్ ఓటమికి కారణమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
TEST CRICKET AT ITS BEST!
What a victory for New Zealand, after following on! pic.twitter.com/ShtVwUVSCj
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 28, 2023