బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన తొలి టెస్టులో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. రెండో మ్యాచులో ఎలాగైనా భారత్ను ఓడించాలని చూస్తోంది. అయితే ఢిల్లీ టెస్టు ఆరంభానికి ముందే కంగారూల్లో భయం మొదలైంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఈ సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. ఇందులో ఊహించిన దానికంటే సులువుగా నెగ్గింది. ఇదే ఊపులో రెండో టెస్టు కోసం మరింత ఉత్సాహంగా సిద్ధమవుతోంది. ఈ మ్యాచులోనూ విక్టరీ కొట్టాలని చూస్తోంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 17న ప్రారంభమయ్యే రెండో టెస్టు.. ఈ సిరీస్లో ఒకరకంగా నిర్ణాయకమనే చెప్పాలి. ఈ మ్యాచులోనూ ఆసీస్ చేతులెత్తేస్తే ఆ జట్టుకు వైట్వాష్ తప్పకపోవచ్చు. రెండో టెస్టు అంటేనే ఆసీస్ బ్యాట్స్మన్ భయపడుతున్నారు. స్పిన్కు అంతగా సహకరించని నాగ్పూర్ పిచ్పై ఆడేందుకు కంగారూ జట్టు బ్యాట్స్మన్ నానాతంటాలు పడ్డారు.
భారత స్పిన్నర్ల దెబ్బకు ఒక్క ఇన్నింగ్స్లో కూడా 200 రన్స్ మార్క్ను ఆసీస్ అందుకోలేదు. రెండో ఇన్సింగ్స్లోనైతే 100 పరుగులు కూడా చేయలేకపోయింది. ఒక్క సెషన్లోనే ఆ జట్టు ఆలౌట్ అయ్యింది. సిరీస్ ఆరంభానికి ముందు భారత్పై గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసిన ఆసీస్ ప్లేయర్లు.. తీరా గ్రౌండ్లోకి వచ్చేసరికి మాత్రం ఆడలేక బ్యాట్లు ఎత్తేశారు. గాయం తర్వాత పునరాగమనం చేసిన రవీంద్ర జడేజా ఆ జట్టు వెన్ను విరిచాడు. రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ స్పిన్ దెబ్బకు కంగారూలు కోలుకోలేకపోయారు. రవిచంద్రన్ అశ్విన్ను ఎదుర్కొనేందుకు డూప్లికేట్ అశ్విన్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేసినా ఆస్ట్రేలియాకు ఫలితం లేకుండా పోయింది.
నాగ్పూర్ పిచ్ స్పిన్కు అంతగా సహకరించకపోయినా టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ స్ట్రెయిట్ డెలివరీలతోనే ఆసీస్ బ్యాట్స్మన్ పనిపట్టారు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బ్యాట్స్మన్ను బీట్ చేస్తూ షాట్లు ఆడేందుకు ఉసిగొల్పారు. ఇటు షాట్లు కొట్టలేక, అటు డిఫెన్స్ చేయలేక కంగారూ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్ బ్యాటింగ్లో చాలా వికెట్లు భారత స్పిన్నర్లు వేసిన స్ట్రయిట్ డెలివరీలకే రావడం గమనార్హం. స్పిన్కు అనుకూలించే పిచ్ అంటూ మ్యాచ్కు ముందు నానాయాగీ చేసిన ఆసీస్.. బంతి పెద్దగా టర్న్ కాకపోయినా ఆడలేకపోయింది. అలాంటప్పుడు స్పిన్కు పూర్తిగా సహకరించే ఢిల్లీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు కోసం పూర్తిగా స్పిన్ వికెట్ను సిద్ధం చేసే చాన్స్ ఉందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మామూలుగానే స్పిన్ ట్రాక్గా చెప్పుకునే ఈ పిచ్ను.. ఒకవేళ పూర్తి టర్నింగ్ ట్రాక్గా మారిస్తే ఆసీస్ బ్యాట్స్మన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. బంతి బాగా టర్న్ అయి, అలాగే తక్కువ ఎత్తులో వస్తే పరుగులు తీయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. ఇలాంటి ట్రాక్ మీద అశ్విన్, జడేజా, అక్షర్ లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను ఎదుర్కోవడం అంటే ఎంతటి బ్యాట్స్మన్కైనా కఠినమైన సవాలే. మ్యాచ్ నాలుగో రోజుకు వెళ్లడం కష్టం కావొచ్చు. టీమిండియాను ఆపడం ఆసీస్ తరం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి, రెండో టెస్టులో భారత స్పిన్నర్ల ధాటిని ఆసీస్ బ్యాట్స్మన్ తట్టుకుంటారని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A splendid five-wicket haul in the second innings from @ashwinravi99 inspires #TeamIndia to a comprehensive victory in the first #INDvAUS Test 🙌🏻
Scorecard ▶️ https://t.co/SwTGoyHfZx…#INDvAUS | @mastercardindia pic.twitter.com/wvecdm80k1
— BCCI (@BCCI) February 11, 2023