ఈ సమాజంలో నిజాలకంటే అబద్ధాలే ఎక్కువ ప్రాచూర్యం పొందుతూ ఉంటాయి. ప్రజలు కూడా పుకార్లు, అసత్య ప్రచారాల పైనే ఆసక్తి చూపిస్తుంటారు. అసలు నిజాలు తెలిసినపుడు నోరెళ్ల బెడుతుంటారు. జోరుగా ప్రచారం జరిగిన చాలా విషయాల్లో ఇదే వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీ రాబోతున్నాయి. 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అయితే, ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్న సంగతి మరిచి సోషల్ మీడియాలో వేరే విషయంపై చర్చ జరుగుతోంది. అదేంటంటే.. ఏపీలో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు.
ఆ తర్వాత అంబానీ కార్యక్రమ ప్రారంభం కోసం జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత తన కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడతాయని కూడా అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో ‘తండ్రి చావుకు కారణమైన వ్యక్తితో వైఎస్ జగన్ సన్నిహితంగా ఉన్నారు’ అంటూ కామెంట్లు రావటం మొదలయ్యాయి. అయితే, గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. రాజశేఖరరెడ్డి మరణానికి ముఖేష్ అంబానీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ నేర పరిశోధనా సంస్థలే తేల్చి చెప్పాయి. అయితే, రాజశేఖరరెడ్డి మరణానికి సంబంధించి ఓ ప్రచారం చాలా ఏళ్లుగా నడుస్తోంది. ఆ ప్రచారం ఏంటంటే.. ‘‘ ఏపీలో కృష్ణా-గోదావరి బేసిన్లో అపారమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని తెలుసుకున్న రిలయన్స్ వాటిని సొంతానికి వెలికి తీయాలనుకుంది.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇందుకు అడ్డు చెప్పారు. దీంతో రిలయన్స్ సంస్థ పథకం ప్రకారం అడ్డు తప్పించింది’’. ఈ మేరకు ‘ది ఎక్సైల్డ్’ సంస్థ ఓ కథనాన్ని సైతం ప్రచురించింది. వైఎస్సార్ మరణంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా కృంగిపోయారు. ఆ బాధలో తమ నాయకుడి మరణానికి ముఖేష్ సోదరులకు సంబంధం ఉందని భావించారు. అప్పట్లో రిలయన్స్ సంస్థలపై దాడులు కూడా చేశారు. అయితే, వైఎస్సార్ మరణానికి అంబానీ బ్రదర్స్కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చిచెప్పాయి. వైఎస్సార్ కేవలం విమాన ప్రమాదం కారణంగానే చనిపోయారని స్పష్టం చేశాయి. మరి, ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.