వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను, నేత కార్మికుల పింఛను, మత్స్యకారుల పింఛను, ఒంటరి మహిళల పింఛను ఇలా రకరకాల పేర్లతో లబ్ధిదారులకు గత మూడేళ్ళుగా పింఛన్లు ఇచ్చుకుంటూ వచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే అనర్హులకు పింఛను ఇవ్వడం వల్ల డబ్బు వృధా అవుతుందని ఆలోచించి ప్రభుత్వం.. అనర్హుల జాబితా తయారుచేసి వారికి పింఛన్లు రద్దు చేస్తామని నోటీసులు పంపుతుంది. వాలంటీర్లు కూడా ఎప్పటికప్పుడు అనర్హులను గుర్తించి.. జాబితా తయారు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు. అనర్హులకు ఎట్టిపరిస్థితుల్లోనూ పింఛన్ అందకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది. నిజానికి అనర్హులకు పెన్షన్ ఇవ్వడం వల్ల డబ్బు వృధా అవుతుందని ప్రభుత్వం ఆలోచించడం సమర్థనీయమే.
కానీ అనర్హులను ప్రభుత్వం ఎలా పరిగణలోకి తీసుకుంటుందనేది ఆలోచించాల్సిన విషయం. కొన్ని లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో అనర్హుల పేరుతో కొంతమందికి పెన్షన్ రద్దు చేస్తూ నోటీసులు పంపడం వల్ల ప్రభుత్వానికి నష్టమా? లాభమా? నిజానికి పెన్షన్ తీసుకునేవాళ్లలో పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులే ఉంటారు. వృద్ధులు అయితే పని చేయలేరు. వారికి ప్రభుత్వం ఇచ్చే పెన్షనే ఆధారం. మత్స్యకారులకు, నేత కార్మికులకు పెన్షన్ ఇస్తుంది. ఇలాంటి వారికి పెన్షన్ ఇవ్వడం వల్ల ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ఒంటరిగా ఉన్న మహిళలకు, వితంతువులకు పెన్షన్ తప్పనిసరి. మగదిక్కు ఉండదు కాబట్టి ఆ పెన్షన్ వారి ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది.
వీళ్ళలో ఎవరూ ధనవంతులు ఉండరు. అందరివీ చాలా చిన్న జీవితాలు. వీళ్ళలో పెన్షన్ వస్తే తప్ప తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు ఉంటారు. పెన్షన్ డబ్బుతోనే ప్రతి నెలా జీవనం సాగించేవాళ్ళు ఉంటారు. వీరి దగ్గర పెద్దగా ఆస్తులు కూడా ఉండవు. ఉన్నా కూడా అవేమీ వీళ్లకి తిండి పెట్టవు. ఊళ్ళో పొలాలు ఉండి కూడా పనులకు పోయే పరిస్థితి. అలాంటిది అనర్హులు అని చెప్పి.. వచ్చే ఆ కొంచెం ఆర్థిక తోడ్పాటుని కూడా దూరం చేస్తే.. ప్రభుత్వం పై కచ్చితంగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. గడిచిన మూడన్నరేళ్ల కాలంలో పేదల సంక్షేమం విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా రాజీ పడింది లేదు. ఈ సంక్షేమ పథకాలే తనని మళ్ళీ అధికారంలో కూర్చోబెడుతాయని ఆయన బలంగా నమ్ముతున్నారు.
అయితే.. ఎన్నికలకి గట్టిగా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో.. కాస్త స్థలం ఉన్న వారు, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చే వారు.. పెన్షన్ కి అనర్హలు అంటూ నోటీసులు ఇవ్వడం ప్రభుత్వానికి చెడు చేసే అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి అనర్హులను ఈ జాబితా నుండి తొలగిస్తే అది మంచి విషయమే. కానీ.., అది మూడేళ్ళ క్రితం జరిగి ఉంటే.. అది సీఎం జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చేది. కానీ.., ఏడాదిలో ఎన్నికలు పెట్టుకుని, ఇప్పుడు ఇంతటి అసంతృప్తిని మూట కట్టుకోవడం ఎందుకు అన్నది సొంత పార్టీ నేతలే సంధిస్తున్న ప్రశ్న. సో.. ఇలా జగన్ ఓ మంచి పనికే శ్రీకారం చుట్టినా.. కాస్త టైమింగ్ తేడా కొట్టడంతో అసలుకే ఎసరు పడేలా పరిస్థితి తయారైంది. మరి.. ఈ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పునరాలోచన చేస్తారేమో చూడాలి