వినాయక చవితి వేడుకల విషయంలో ఏపీ సర్కారు ఆంక్షలు విధించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. వైసీపీ నేతల కార్యక్రమాలకు కరోనావైరస్ నిబంధనలు అడ్డురానప్పుడు వినాయక చవితి ఉత్సవాలకు మాత్రం కోవిడ్ మార్గదర్శకాలు, నిబంధనలు ఎలా వర్తింపజేస్తారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ సంస్మరణ సభకు కరోనా లేదు కానీ విపక్షాలు ప్రభుత్వం తీరును నిరసిస్తూ ధర్నాలు చేస్తే కరోనా కేసులు పెడతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల రాజకీయ పీక్స్ కు చేరుకుంటోంది. రోడ్ల మరమ్మత్తులపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఎయిర్ పోర్టులు పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో కలిపారు తప్ప ఇంకేం లేదని పవన్ విమర్శించారు. జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారులు. ఆ సమస్య గురించే మాట్లాడాలని పవన్ నిలదీశారు. వినాయక చవితిపై విధించిన ఆంక్షలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. పక్క రాష్ట్రాలు ఎలాంటి పరిమితులతో అనుమతులు ఇచ్చాయో అదే పరిమితులతో ఇక్కడ కూడా పర్మిషన్లు ఇవ్వాలి. ఇది విశ్వాసానికి సంబంధించినది కాబట్టి అలా ఇస్తేనే మంచిది. జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది ఇంతకుమించి గొడవ చేయకుండా పర్మిషన్లు ఇవ్వాలి. ఇచ్చి తీరాలి. వేరే దారి లేదు.’’ అని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మనదేశంలో ఏ పని మొదలుపెట్టినా ముందుకు నమస్కరించేంది గణపతికేనని పవన్ అన్నారు. గణపతి పండగను జరుపుకోవద్దు అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేసినా రథాలను కాల్చేసినా శ్రీరాముడి విగ్రహానికి తలతీసేస్తే ఈ రోజు వరకు దోషులను పట్టుకోలేదన్నారు. వారిని పట్టుకోకపోగా ఈ రోజు కొత్తగా వినాయక చవితి జరుపుకోవద్దు అని నిబంధనలుపెట్టడం దేనిని సూచిస్తున్నాయని ప్రశ్నించారు.