రాజకీయాల్లో ఇటు పుల్ల అటు కదిలినా.. అటు పుల్ల ఇటు కదిలినా సరే.. దాని వెనకే పెద్ద కారణమే ఉంటుంది అంటారు రాజకీయ విశ్లేషకులు. కారణం లేకుండా.. రాజకీయాల్లో చిన్న సంఘటన కూడా చోటు చేసుకోదు అంటారు. ఇక రాజకీయ నేతలు తీసుకునే నిర్ణయాలు, వ్యూహాలు కూడా.. ఏదో ఆశామాషీగా.. అప్పటికప్పుడు తీసుకునేవి అయి ఉండవు. వాటి వెనక ఏవో బలమైన కారణాలుంటాయి. పైగా వాటి గురించి ముఖ్య నేతలు, తన సన్నిహితులతో అన్ని రకాలుగా చర్చించి.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. తాజాగా నాగబాబు చేసిన ప్రకటన మీద కూడా రాజకీయ వర్గాల్లో ఇలాంటి చర్చే సాగుతోంది. కొన్ని రోజుల క్రితం నాగబాబు.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించి సంచలనం సృష్టించారు. నాగాబాబు చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. అయితే వైసీపీ నేత కోసమే నాగబాబు.. ఇలాంటి త్యాగానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. ఇంతకు ఎవరా నేత.. నాగబాబు నిర్ణయం వెనక మతలబు ఏంటి అంటే..
కొన్ని రోజుల క్రితం జనసేన వీర మహిళల సమావేశంలో పాల్గొనేందుకు కర్నూలుకు వెళ్లిన నాగబాబు.. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పొత్తులపై తనకు ఎలాంటి సమాచారం లేదని.. అలానే రానున్న ఎన్నికల్లో పవన్కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా సస్పెన్స్ అంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని.. ఎన్నికల బరిలో నిలబడాలనే ఆసక్తి కూడా తనకు లేదని స్పష్టం చేశాడు నాగబాబు. కేవలం జనసేన పార్టీ నిర్మాణంపై తాను దృష్టి పెడతానన్నారు. అయితే నాగబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఓ వైసీపీ నేత ఉన్నారంట.
గత ఎన్నికల్లో నాగబాబు.. తూర్పు గోదావరి జిల్లా.. నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి.. నాగబాబు మాత్రం.. బలమైన ఓటు బ్యాంకుతో ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చాడు. ఇక ఈ సారి జనసేన.. పొత్తులతో ముందుకు వెళ్తుంది అనేది అందరికి తెలిసిన సంగతి. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే.. ఈ సారి కచ్చితంగా నరసాపురం టికెట్ను నాగబాబుకే కేటాయిస్తారు. పొత్తులతో వెళ్తున్నారు కాబట్టి.. ఆయన కచ్చితంగా గెలుస్తారు అని కార్యకర్తలు భావించారు. కానీ ఇందుకు భిన్నంగా నాగబాబు.. మాత్రం.. అసలు పోటీ చేయడం లేదని ప్రకటించి షాకిచ్చారు.
అయితే నాగబాబు నిర్ణయం వెనక బలమైన కారణం ఉందని అంటున్నారు రాజీకయ విశ్లేషకులు. వాస్తవానికి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాగబాబు సిద్ధం అయ్యారని.. కాకపోతే.. పొత్తుల నేపథ్యంలో ఈ సారి నరసాపురం టికెట్ను టీడీపీ.. తన దగ్గర అట్టి పెట్టుకోవాలని భావిస్తోందని సమాచారం. ఎందుకంటే.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
దీనిపై చంద్రబాబు-పవన్ కళ్యాణ్లు ఇద్దరు చర్చించుకుని.. ఓ నిర్ణయానికి వచ్చాకే.. నాగబాబుని అక్కడి నుంచి తప్పించారని.. అందుకే ఆయన ఎన్నికలకు దూరమవుతున్నట్టు ప్రకటించారని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాక నాగబాబుకు రాజ్యసభ సీటును కూడా ఖరారు చేశారని.. ఇది కూడా పోత్తుల్లో భాగంగానే ఖరారైందని అంటున్నారు. వైసీపీ రెబల్ నేత రఘురామ కోసం నాగబాబు ఈ త్యాగం చేస్తున్నారని సమాచారం. మరి రఘురామ కోసమే నాగబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.